యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు భక్త జన సందోహం నడుమ చాలా ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లనయ్య గా నరసింహుడు అలంకృతుడై భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకార, వాహన సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఆలయ పండితులు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలు ... మత్స్యావతారంలో ఊరేగిన స్వామి .. నేడు కృష్ణావతారం
నాలుగో రోజు నల్లనయ్యగా నారసింహుడు
యాదాద్రిలో పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా ఉత్సవ పూజలతో పాటు అలంకార వేడుకలు నిర్వర్తించారు. వీటితో బాలాలయం కన్నుల పండుగగా మారింది. అంగరంగ వైభవంగా స్వామిని శ్రీకృష్ణుడి అలంకరణతో పెళ్లికొడుకుగా తీర్చిదిద్దారు. ఆలయ మండపంలో ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనులు భక్తి పారవశ్యంలో మునిగిపోగా స్వామివారి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఋత్విక్కుల పారాయణ ల నడుమ ,మేళతాళాలతో పుష్పాలంకృతమైనపల్లకిలో, ప్రబంధాల మధ్య సేవాపర్వాన్ని చేపట్టి ఆ విశిష్టతను అందరికీ వివరించారు. రాత్రివేళ స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై ఉంచి విహారయాత్ర జరిపించారు. నల్లనయ్య గా నరసింహుడు నాలుగవ రోజు కనువిందు చేశారు .
.. రాత్రి పొన్న వాహన సేవ
ఇక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం 11 గంటలకు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు తో పాటుగా, పొన్న వాహనసేవను నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు సైతం స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు భక్తజనం యాదాద్రికి పోటెత్తుతున్నారు.
దేవాదాయశాఖామంత్రిని వేడుకలకు ఆహ్వానించిన ఆలయ ఈవో గీత
అత్యంత ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ ఈవో గీత ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు పుష్కరిణి వద్ద గల శ్రీ చక్ర బ్లాక్ లో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గా ఆలయ ఈవో తెలిపారు. తెలంగాణకే తలమానికమైన, పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకలను అశేష జనవాహిని చూసి తరించేలా యాదాద్రిలో ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో గీత తెలిపారు .