ఏపీ 'అమరావతి'కి యాదగిరిగుట్ట, సమ్మక్క-సారక్క, మెదక్ చర్చి మట్టి
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిర్మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉవ్వీళ్లూరుతున్నారు. అమరావతి తెలుగు ప్రజలు గౌరవించే స్థాయిలో నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఈ నేపథ్యంలో 'మన నీరు...మన మట్టి...మన అమరావతి' కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అన్ని గ్రామాల నుంచి మట్టిని, నీటిని తీసుకు వచ్చి అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నారు. తద్వారా అన్ని గ్రామాలను భాగస్వామ్యం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏపీలోని ఆలయాలు, చర్చిలు, మసీదులతో పాటు తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు, మసీదులు, చర్చిల నుంచి మట్టిని, నీరును తీసుకు వెళ్లనున్నారు. తెలంగాణలోని భద్రాచలం, యాదాద్రి, మేడారం సమ్మక్క సారక్క, మెదక్ చర్చి, అలంపూర్, వేయి స్థంభాలగుడి, బాసర వంటి ఆలయాల నుంచీ మట్టిని సేకరించి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.
అలాగే, వైష్ణోదేవి ఆలయం, స్వర్ణ దేవాలయం, బుద్ధ గయ, రామేశ్వరం, కాశీ, పూరి, శబరిమలై, ఛార్ధామ్ వంటి దివ్యక్షేత్రాలు, అజ్మీర్, నాగపట్నం వేళంగిణి, జామా మసీదు, ముంబై, హైదరాబాద్ మక్కా మసీదు వంటి ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని తేవాలని, ఈ కార్యక్రమానికి ఎంపీలు బాధ్యత తీసుకుని పూర్తి చేయాలన్నారు.
దేశానికి మార్గదర్శకులుగా నిలిచిన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాం, మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల గ్రామాల నుంచీ మట్టిని తీసుకొచ్చి కలపడంవల్ల ప్రజారాజధాని మరింత శక్తిమంతంగా మారుతుందన్నారు.
ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి హంగామా చేయాలని అనుకోవడం లేదని, అయితే ఎక్కువ మందిని భాగస్వాములు చేయడం ద్వారా ప్రజా రాజధానిలో జరిగే తొలి శుభకార్యానికి మరింత వన్నె తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం చెప్పారు.
శంకుస్థాపనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు కొంత మంది చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ఇలాంటి ఆరోపణలు చేసేవారు తగిన ఆధారాలు లేకుండా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.