యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ లో మరో కోణం.. అనాదలుగా మిగిలిన 25 మంది చిన్నారులు
యాదాద్రి : పిల్లలు దేవుడిచ్చిన వరం. పిల్లలు లేరని తల్లిడిల్లే మాతృ హృదయాలు ఎన్నో .. తమకు పిల్లలు పుట్టారని తెలియడంతో అనాదశ్రమానికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చి పెంచుకునేవారు ఉన్నారు. కానీ యాదగిరిగుట్టలో జరిగిన సెక్స్ రాకెట్ అంశంలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసు తొలి నుంచి సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా మరో 25 మంది చిన్నారులు ఎవరని తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
వెలుగులోకి వచ్చిందిలా ..
7 నెలల క్రితం గుట్ట పరిసరాల్లో వ్యభిచార గృహలు నిర్వహిస్తున్నారని కొందరు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ దాదాపు 36 మంది చిన్నారులను వ్యభిచార ముఠా కబందహస్తాల నుంచి విముక్తి కలిగించింది. నెలరోజులు జరిపిన సోదాలు .. కేసు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలను చిత్రహింసలకు గురిచేశారని .. వారి శారీరక ఎదుగుదల కోసం హార్మోన్ గ్రోత్ ఇంజెక్షన్ ఇచ్చి 14 ఏళ్లు దాటగానే వ్యభిచార కూపంలోకి దింపుతున్నారనే అంశాలు బయటపడ్డాయి. అంతేకాదు పోలీసులు దాడులు చేసిన సమయంలో దొరకుండా ఇళ్లలో సొరంగాలు తవ్వి అందులో బాలికలను దాచిపెట్టారనే వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. వరుస పోలీసు దాడులతో హడలిపోయిన వ్యభిచార గృహ నిర్వాహకులు ఇళ్లకు తాళాలు వేసిన పారిపోయారు. ఆ సమయంలో 22 ఇళ్లను రెవెన్యూ, పోలీసులు సీజ్ చేయగా .. అవీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఈ కేసులో 29 మందిపై పీడీ యాక్టు కింద కేసు పెట్టారు. ఇందులో 14 మంది జైలులో ఉన్నారు.
36 మందికి చెర నుంచి విముక్తి
పోలీసుల దాడులతో బయటపడ్డ 36 మందిని వివిధ ఆశ్రమాల్లో ఆశ్రయం కల్పించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఆశ్రమంలో 26 మంది .. ఏడుగురిని నల్గొండ జిల్లాలోని ఆశ్రమానికి తరలించారు. వీరిని టీవీల్లో చూసి తమ పిల్లలేనని .. తప్పిపోయారని గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, వరంగల్ సహా పలుప్రాంతాల నుంచి 14 కుటుంబాలు యాదాద్రి పోలీసుస్టేషన్ కు వచ్చాయి. ఆధారాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వారికి పోలీసులు నచ్చజెప్పి పంపించారు. పట్టుబడ్డ పిల్లలంతా తమవారేనని వ్యభిచార గృహ నిర్వాహకులు చెప్పారు. పిల్లలంతా ఇదే వృత్తిలో పుట్టారని .. వీరు తల్లులు కొందరు పారిపోయారని .. మరికొందరు చనిపోయారని చెప్పడంతో అక్కడున్న వారితో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.
ముగ్గురివే మ్యాచ్ .. మరి 25 మంది పిల్లలు ఎవరు ?
ఆ 36 మంది పిల్లలకు వ్యభిచార గృహ నిర్వాహకులతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 28 రిపోర్టులు వచ్చాయి. మరో 8 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 28 మందిలో కేవలం ముగ్గురు పిల్లల డీఎన్ఏ మాత్రమే నిర్వాహకులతో మ్యాచ్ అయింది. దీంతో ఆ 25 మంది పిల్లలు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. వీరిని వ్యభిచార గృహ నిర్వాహకులు ఎక్కడినుంచి తీసుకొచ్చారు ? పిల్లలను విక్రయించే ముఠాల నుంచి కొనుగోలు చేశారా ? అనాద పిల్లలను తీసుకొచ్చి కూపంలో దించాలనుకున్నారా ? ఒకవేళ ఈ కూపంలో రోగాల బారినపడి తల్లులు చనిపోతే .. పిల్లలను వీరే పెంచుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
రంగంలోకి రాచకొండ సీపీ
చిన్నారులు ఎవరనో అంశం తెలియకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగారు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్. తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లలో నమోదైన చిన్న పిల్లల మిస్సింగ్ కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని .. ఈ పిల్లల వివరాలను, ఫొటోలతో కలిపి చూస్తున్నారు. పిల్లల మిస్సింగ్ పై ఇటీవల వచ్చిన వెబ్ సైట్లను కూడా పరిశీలిస్తున్నారు. గతంలో వచ్చిన 14 మంది కుటుంబాలను పిలిచి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు సీపీ.
కోర్టు తీర్పు ప్రతిబంధకమా ..
టీవీల్లో చూసి యాదాద్రి పీఎస్ కు వచ్చిన 14 కుటుంబాలను పిల్లలను కలువనీయొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. వార్త కథనాల ఆధారంగా సుమోటోగా స్పందించిన హైకోర్టు .. ఈ మేరకు తీర్పునిచ్చింది. అయితే ఆ 25 మంది పిల్లలకు 14 కుటుంబాలతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించడం ప్రతిబంధకమా ఏర్పడుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
ఇంజెక్షన్ల ప్రయోగం జరగలేదు
చిన్నారుల శారీరక ఎదుగుదలకు ఇంజెక్షన్ల ప్రయోగం జరుగలేదని సీడబ్యూస్లీ చైర్మన్ తెలిపారు. పిల్లల శారీరక ఎదుగుదల కోసం హార్మోన్ గ్రోత్ ఇంజెక్షన్లను ప్రయోగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆర్ఎంపీ నరసింహా సాయం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అలాంటి ఇంజెక్షన్లు వాడలేదని సీడబ్ల్యూసీ తెలుపడం చర్చానీయాంశమైంది.