ఆయనకు ఏడు రోజులపాటు నేనే డ్రైవర్ను: తిరునక్షత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: త్రిదండి చినజీయర్ స్వామితో తనకున్న సాన్నిహిత్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. భగవద్ రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్లో వెలువడం చాలా గర్వకారణమని అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుందామని చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన కార్య్రమంలో తాను ఓ సేవకుడిలా పాల్గొంటానని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా పెద జీయర్ స్వామిపై రచించిన సత్య సంకల్ప పుస్తకాన్ని చినజీయర్ స్వామికి కానుకగా అందించారు కేసీఆర్.
నాది బాల్య వివావమే..
భగవంతుడిని పూజించే సంస్కారం తమకు తల్లిదండ్రుల నుంచే పరంపరగా వచ్చిందన్నారు. తనది బాల్య వివాహమని చెప్పిన కేసీఆర్.. 14వ యేటే వరంగల్ జిల్లా చిత్తలూరులో తన వివాహం జరిగిందని తెలిపారు. ఆరోజుల్లో గురువులు వస్తే తమందరికీ పండగలా ఉండేదన్నారు. వారొస్తే నెలరోజులపాటు గ్రామంలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తమ ఇళ్లల్లోనే ఉంటూ భారతం, భాగవతం బోధించేవారని చెప్పారు. వారే తమను సంస్కారవంతులుగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు.
మా ఇంట్లోనే ఆయన బస..
1986-87లో సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞం జరిగిన సమయంలో భక్తులు, వికాస తరంగిణి మిత్రులంతా తన వద్దకు వచ్చి ఈ కార్యక్రామనికి తప్పక వెళ్లాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాను సరే అనడంతో పనులు ప్రారంభించామని తెలిపారు. తమ గ్రామంలో అప్పుడు బ్రాహ్మణ పరిషత్ లేదని తెలిపారు. దీంతో స్వామీజీ ఉండేందుకు సరైన చోటు కూడా లేకపోవడంతో గ్రామస్థులు వచ్చి చినజీయర్ను తన ఇంట్లోనే ఉంచాలని చెప్పారని.. దీంతో తాను ఏడు రోజులపాటు ఆయనకు తమ ఇంట్లోనే బస ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్వామీజీకి నేను డ్రైవర్..
ఆ సమయంలోనే తాను చినజీయర్ స్వామికి డ్రైవర్గా మారిపోయానని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. స్వామీజీ పలు ఆలయాలకు వెళ్లినప్పుడు తానే వాహనానికి డ్రైవింగ్ చేశానని చెప్పుకొచ్చారు. దాదాపు 7-8 రోజులపాటు తానే కారును డ్రైవ్ చేయడంతో ఆయనతోపాటే ఉండటంతో స్వామీజీ చేసిన అనుగ్రహ భాషణలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని కేసీఆర్ తెలిపారు.
ఫిబ్రవరిలో యాదాద్రి..
యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. ఫిబ్రవరిలో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని చినజీయర్ స్వామి చెప్పారని తెలిపారు. యాదాద్రిలో 1008 కుండాలతో మహా సందర్శన యాగం నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి స్వాములను పిలిపించాలని సంకల్పించినట్లు సీఎం తెలిపారు.