తుపాకీతో తలకు గురిపెట్టాడు, బాబుతో సంబంధంలేదు: కోలుకున్న యాదగిరి
హైదరాబాద్: నగరంలోని బోయిన్ పల్లిలో తనపై కాల్పులు జరిపిన డెక్కల (డాకూరి) బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాల్పుల్లో గాయపడ్డ కాంగ్రెస్ నేత యాదగిరి తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ప్రాణహాని ఏమీ లేదని వైద్యులు చెప్పారు. బుల్లెట్ గుండె పక్క నుంచి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు.
సోమవారం ఉదయం ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా, కాల్పుల ఘటన నుంచి కోలుకున్న యాదగిరి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని అన్నారు. తనపై కాల్పులు జరిపిన బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడి బావమరిది మాత్రం ఎప్పుడైనా డబ్బులు కావాలంటే తనకు వద్దకు వచ్చి తీసుకునే వాడని చెప్పారు.
'అన్నా ' అని వెంటాడి కాల్పులు: యాదగిరి హత్యాయత్నం నిందితులు(వీడియో)
తనకు తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని అన్నారు. కాల్పులు జరిగే సమయంలో ఆస్పత్రి బాత్ రూంలో దాక్కున్నానని, ఆ సమయంలో బాత్ రూంపై తుపాకీ పెట్టి తన తలపై షూట్ చేయబోయాడని చెప్పాడు. దీంతో అతడ్ని ప్రతిఘటించి తుపాకీ లాక్కున్నానని, తర్వాత 100కు కాల్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది బయటకు రావడంతో తాను బయటకు వచ్చానని చెప్పాడు. పోలీసులకు ఇచ్చేందుకు తన వెంటే తుపాకీ ఉంచుకున్నానని, తెలిసిన వ్యక్తి తనను ఆస్పత్రిలో చేర్చాడని తెలిపారు.
రక్షణ కల్పించండి
డెక్కల (డాకూరి) బాబు నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓల్డ్ బోయిన్ పల్లిలో తుపాకీ కాల్పులకు గురైన కాంగ్రెస్ నేత యాదగిరి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. డెక్కల బాబు ఎవరో తమకు తెలియదని వారు తెలిపారు. డెక్కల బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని వారు ఆరోపించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో యాదగిరి కుమార్తె పోటీ చేయడంతో, తమ కుటుంబ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు బాబుకు సుపారీ ఇచ్చి హత్య చేయాలని పురమాయించి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు.