యాదాద్రి పుణ్యక్షేత్రం చరిత్రలో మిగిలిపోవాలి..! సీయం కేసీఆర్ ఆకాంక్ష..!!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్న గుట్టపైనా జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయ పునర్నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రకారాలు, మాడవీధులు, రథశాల, వ్రత మంటపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు, శివాలయం పనులను పరిశీలించారు. అధికారులకు, శిల్పులకు తగు సూచనలు చేశారు.
యాదాద్రి పవిత్రమైన పుణ్యక్షేత్రం కావాలి..! నిర్మాణంలో రాజీ పడొద్దన్ని సీయం..!!
అంతే కాకుండా ప్రధాన ఆలయమున్న ప్రాంతంలోని 173 ఎకరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తర్వాత టెంపుల్ సిటీగా అభివృద్ధి పరుస్తున్న గుట్టను సందర్శించారు. అక్కడి పనులను పరిశీలించారు. రెండు గుట్టలను కవర్ చేస్తూ ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తామని, నిధులు వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణ పనులన్నింటినీ సమాంతరంగా చేయాలని చెప్పారు. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే శాశ్వత నిర్మాణం కాబట్టి ఎలాంటి తొందరపాటు, తొట్రుపాటు లేకుండా పనులు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు.
ఎంత ఖర్చైనా పరవాలేదు..! లోపం జరగొద్దు..! కేసీఆర్ ఆదేశం..!!
ముఖ్యమంత్రి వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపిలు జె.సంతోష్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, పైళ్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిశోర్, మర్రి జనార్థన్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు క్రిష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, రాచకొండ సిపి మహేశ్ భగవత్, ఆలయ ఈవో గీత తదితరులున్నారు.
అన్నదాన సత్రం కోసం రాజు వెగెస్నా 10 కోట్ల విరాళం..! ముందుకొస్తున్న దాతలు..!!
యాదాద్రిలో అన్నదాన సత్రం నిర్మించడం కోసం హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజు వెగెస్నా ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు 10 కోట్ల విరాళం అందించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు అనంత కోటి రాజు, కార్యదర్శి ఆనందర రాజుల ఆధ్వర్యంలో యాదాద్రిలో ముఖ్యమంత్రిని కలుసుకున్న సభ్యులు చెక్కు రూపంలో విరాళం అందించారు.
దాతలకు కేసీఆర్ క్రుతజ్ఞతలు..! మరింత మంది ముందుకు రావాలని పిలుపు..!!
అన్నదాన సత్రం నిర్మాణానికి ఇంతకంటే ఎక్కువ వ్యయం అయినా భరిస్తామని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. యాదాద్రిలో సత్రాలు, గెస్టు హౌజులు నిర్మించడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికి 43 మంది దాతలు తలా 2 కోట్ల ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. వారందరికీ సిఎం ధన్యవాదాలు తెలిపారు.