యాలాల ఎస్సై మృతి: తాండూరులో ఆ రోజు ఏం జరిగింది?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని యాలాల ఎస్సై రమావత్ రమేష్ చనిపోవడానికి ముందు ఆయన కదలికలపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. యాలాల ఎస్సై రమేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయనను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు.
గత మంగళవారం తాండూరు పట్టణంలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారు, ఎవరెవరిని కలిశారనే కోణంలో పోలీసులు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిపై ఆరోపణలు వస్తుండడంతో పోలీసు అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భార్య గీతతో కలిసి రమేష్ టిఎస్ 07 ఈజీ 7082 మారుతి ఆల్టో తెలుపు రంగు కారులో మంగళవారం సాయంత్రం సుమారు 4.52 గంటలకు తాండూరు పట్టణంలోకి ప్రవేశించినట్లు సిసి టీవీ ఫుటేజీలను బట్టి తెలుస్తోందని అంటున్నారు.
తాండూరులోకి ప్రవేశించిన తర్వాత పండ్ల దుకాణం వద్ద కారును ఆపారు. అక్కడ పండ్లు కొన్నట్లు, ఆ సమయంలో వెంట వచ్చిన కానిస్టేబుల్ వేణు ఉన్నట్లు సిసిటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు చెబుతున్నారు. పండ్ల దుకాణం వద్ద దాదాపు 9 నిమిషాల పాటు ఆగినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచి ట్వీల్స్ బట్టల దుకాణం, చైతన్య కళాశాల మార్గం మీదుగా శాంత్ మహల్ చౌరస్తా వైపు సాయంత్రం 5.01 గంటలకు ఎస్ఐ ప్రయాణించిన కారు వెళ్లినట్లు ఫుటేజీలో గుర్తించారని అంటున్నారు.
వెళ్లిన మార్గంలోనే కారు తిరిగి సాయంత్రం 5.25 గంటలకు అంబేడ్కర్ చౌరస్తా మీదుగా బస్టాండ్ ఫ్లైఓవర్ వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. దాదాపు ఐదు నిమిషాల తర్వాత కారు ఫ్లైఓవర్ వైపు నుంచి అంబేడ్కర్ చౌక్ వైపు వస్తుండగా ఆర్టీసి బస్సులు బయటకు వెళ్లే మార్గం గుండా ఎదురుగా బస్సు రావడంతో ఆగిపోయినట్లు కూడా సిసిటీవీ ఫుటేజీలో రికార్డు అయినట్లు తెలుస్తోంది.
కారును మళ్లీ స్టార్ట్ చేసుకుని అంబేడ్కర్ చౌక్ మీదుగా ఇందిరా చౌక్ వైపు సాయంత్రం దాదాపు ఐదున్నర గంటల ప్రాంతంలో వెళ్లినట్లు కూడా అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. సిసిటీవీ పుటేజీల ఆధారంగా ఎస్సై రమేష్ ఆ రోజు ఎటు వైపు వెళ్లారనేది కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.