ఈటెల ప్రసంగంతో తలెత్తుకున్నా: యార్లగడ్డ, ‘తలదించుకునేలా యనమల’
న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తాను తలెత్తుకున్నానని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఆంగ్లంలో బడ్జెట్ ప్రవేశపెట్టారని, దీంతో తాను తల దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు యనమల రామకృష్ణుడు, ఈటెల రాజేందర్ శాసనసభల్లో బడ్జెట్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈటెల రాజేందర్ తెలంగాణ శాసనసభలో తెలుగులో ప్రసంగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కాగా, ఏపీ ఆర్థిక మంత్రి మాత్రం ఇంగ్లీష్ ప్రంగంతోనే రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. అక్కడక్కడ మాత్రమే ఆయన తెలుగులో మాట్లాడారు.