సర్పంచ్ వేధింపులు?: యువ గ్రామ కార్యదర్శి ఆత్మహత్య, సూసైడ్ నోట్లో ఏముందంటే?
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మర్లు ప్రాంతానికి చెందిన ఈదుల అరుణ్ చంద్ర(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్వాడ మండలం యారోనిపల్లిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు అరుణ్ చంద్ర.
ఉరివేసుకుని ఆత్మహత్య..
బుధవారం రాత్రి ఇంటి మేడపై పడుకున్న అరుణ్ గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కిందకు దిగి ఇంట్లోకి వెళ్లాడు. ఉదయం ఏడు గంటల సమయంలో కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూడగా అరుణ్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. దీంతో వారు వారువెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించారు.అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తేల్చారు.
సర్పంచ్ వేధింపులే కారణమంటూ..
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు, స్థానికులను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యకు యారోనిపల్లి సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి, వార్డు సభ్యుడు తిరుపతయ్య కారణమని అరుణ్ చంద్ర తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిజర్వేషన్లో ఉద్యోగం సాధించి తమ ముందు విర్రవీగుతున్నావంటూ విమర్శించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించడంతోనే అరుణ్ మనస్తాపానికి గురై ఆరు రోజులుగా విధులకు హాజరు కావడం లేదని, ఈ క్రమంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని బాధితుడి తండ్రి ఆరోపించారు. తమ కొడుకు మృతికి కారణమైన సుధారాణి, అనంతరెడ్డి, తిరుపతయ్యలపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
ఫైళ్లలో సూసైడ్ నోట్..
అరుణ్ చంద్ర ఆత్మహత్యపై సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి స్పందించారు. ఏప్రిల్ 24 నుంచి అరుణ్ చంద్ర విధులకు హాజరుకావడం లేదని,ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని.. దీంతో మే 1న ఎంపీడీవోకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మే 2న పంచాయతీ కార్యాలయంలోని ఫైళ్లలో సూసైడ్ నోట్ కనిపించగా ఎంపీడీవో, ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
పని ఒత్తిడే కారణమా?
తన చావుకు ఎవరూ కారణం కాదని అరుణ్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. తల్లిదండ్రులతోపాటు స్నేహితులకు ఆ లేఖలో అరుణ్ క్షమాపణలు చెప్పారు. పని ఒత్తిడి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అరుణ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని, ఆ లేఖ ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరుణ్ మరణంతో అతని కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది.