‘శ్రీమంతులు’: సొంతూరుకు భారీ విరాళం ప్రకటించిన ‘యశోద’ అధినేతలు
హైదరాబాద్: నగరంలో ప్రైవేట్ వైద్య రంగంలో మెరుగైన సేవలందిస్తున్న ‘యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్' యాజమాన్యం దాతృత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుకుని ‘శ్రీమంతులు' అయ్యారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్కు చెందిన గొరుకంటి యశోద, రాంచందర్ రావు (పేష్కారి) దంపతుల నలుగురు కొడుకులు రవీందర్ రావు, సురేందర్ రావు, నరేందర్ రావు, దేవేందర్ రావులు ఉన్నత చదువులు చదివి ఉమ్మడిగానే తల్లి పేరిట ‘యశోద' ఆస్పత్రిని నెలకొల్పారు.
ప్రస్తుతం ఈ ఆస్పత్రి తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశంలోనూ ఓ ప్రముఖ ఆస్పత్రిగా కొనసాగుతోంది. కాగా, గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గ్రామజ్యోతి' ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సోవమారం శ్రీకారం చుట్టింది.
కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలు ఈ పథకంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవలే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన యశోద ఆస్పత్రుల అధినేతలు తమ సొంతూరు అభివృద్ధికి ఏకంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు.
అంతేగాక, గ్రామంలో ఇప్పటికీ తమకు ఉన్న 11 ఎకరాల 30 గుంటల సాగు భూమి, 30 గుంటల స్థలంలో ఉన్న పెంకుటిల్లును కూడా ప్రభుత్వానికి అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సిఎం కెసిఆర్కు భూమి పత్రాలతో పాటు చెక్కును వారు విరాళంగా అందించనున్నారు.
ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘శ్రీమంతుడు' చిత్రంలో కథానాయుకుడు కూడా తమ సొంత ఊరులో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తాడు. అదే విధంగా ఇక్కడ ‘యశోద' అధినేతలు తమ సొంతూరుకు భారీ విరాళం ప్రకటించడం గమనార్హం.