దిల్సుఖ్ నగర్ పేలుళ్లు: నేరస్తులకు 2సార్లు ఛాన్స్, ఇవీ సాక్షాలు..
దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నేరస్తులకు జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ఉరిశిక్షను ఖరారు చేసింది.
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నేరస్తులకు జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ఉరిశిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం వీరు ఐదుగురు చర్పల్లి జైలులో ఉన్నారు. 2013, ఫిబ్రవరి 21న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు జరిగాయి.
ఈ జంట పేలుళ్లలో 19 మంది చనిపోయారు. 130 మంది గాయపడ్డారు. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు పాకిస్థాన్లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్ఐఏ ఇంటర్పోల్ నోటీసు కూడా జారీ చేసింది.
దేశంలో ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాదులపై నేరం రుజువైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. ఈ కేసు పైన తొలుత మలక్పేట, ఆ తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆ తర్వాత కేంద్రం ఆదేశాలతో జాతీయ దర్యాఫ్తు బృందం (ఎన్ఐఏ)కు కేసు బదలీ అయింది.
రెండుసార్లు మాట్లాడే అవకాశం: న్యాయవాది
నిందితులకు రెండుసార్లు మాట్లాడేందుకు న్యాయస్థానం అవకాశం ఇచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
వకాస్ను 22 మార్చి 2014న అరెస్టు చేశారు. ఇతను పాకిస్తాన్కు చెందిన వాడు. ఆ తర్వాత 25 మార్చి 2014లో బీహార్కు చెందిన తెహసీన్ అక్తర్ను అరెస్టు చేశారు. ఇజాజ్ను సెప్టెంబర్ 5వ తేదీన అరెస్టు చేశారు.
కేసుకు సంబంధించి ఎన్ఐఏ 502 దస్త్రాలు, 201 వస్తువులను ఆధారాలుగా చూపించారు. పేలుడు పదార్థాలు, బాంబు అమర్చిన సైకిళ్లు, నిందితల మధ్య జరిగిన సంభాషణలను సాక్షాలుగా చూపించారు. 157 మంది సాక్షులను విచారించారు. వీరి పైన హత్య, హత్యాయత్నం, కుట్ర, అసాంఘీక కార్యకలాపాలు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.