జైలు గోడలు బద్దలుకొట్టుకుని బయటికొస్తా: యాసిన్ భత్కల్ పరారీకి కుట్ర
హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యుడు, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. జైలు నుంచి పారిపోయి వస్తానంటూ బంధువులు, స్నేహితులకు భత్కల్ ఫోన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు.
యాసిన్ భత్కల్ ఫోన్స్ కాల్స్ను రికార్డు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రికార్డు చేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్రాల నిఘా వర్గాలకు ఎన్ఐఏ సమాచారమిచ్చింది. యాసిన్ భత్కల్ తన భార్య జుహీదాతో పలుమార్లు మాట్లాడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
జైల్లో ఖైదీలు మాట్లాడుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ఫోన్లో నుంచే యాసిన్ ఫోన్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే మనం కలుసుకుంటామని భార్య జుహీదాతో యాసిన్ చెప్పినట్లు సమాచారం.
అంతేగాక, త్వరలోనే జైలు గోడలు బద్దలు కొట్టుకుని వస్తానని యాసిన్ చెప్పినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డెమాస్తస్లోని తన స్నేహితుల ద్వారా బయటికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరస్తుల ఫోన్ల వివరాలను విచారణ సంస్థలకు అందిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.