కవితకు పసుపు రైతుల దెబ్బ..! అనూహ్యంగా వెనకబడ్డ సీఎం తనయ..!!
హైదరాబాద్ : తెలంగాణలో అన్ని చోట్లా గులాబీ పార్టీ దూసుకుపోతున్నా అత్యంత కీలకమైన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం వెనుకబడి ఉంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. అభ్యర్ధులు ఎక్కువగా ఉండటం వల్ల దేశంలోనే ఎక్కువ కౌంటింగ్ బెంచ్ లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందువల్ల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభించి ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు.
పోస్టల్ బ్యాలెట్లలో కల్వకుంట్ల కవితకు ఆధిక్యత దక్కలేదు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించగా తొలి రౌండ్లోనే బిజెపి అభ్యర్ధి ఆధిక్యత కనబరిచారు. నిజామాబాద్లో బిజెపి అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పసుపు, ఎర్రజొన్న రైతులు 185 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే. పసుపు రైతులలో టిఆర్ ఎస్ అభ్యర్ధిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇదే కౌంటింగ్లో ప్రతిబింబిస్తున్నది. రెండు రౌండులో బిజెపి అభ్యర్ధికి 18 వేల మెజారిటీ ఉన్నట్లు అనధికారికంగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ధర్మపురి అరవింద్ ముందంజలో ఉండడమే కాకుండా స్పష్టమైన ఆదిక్యాన్ని కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.