అంతా రహస్యమే! ఒకటి చెప్పేవాళ్లు.. ఇంకోటి చేసేవాళ్లు, ఇవాంకా టూర్పై సీఎం కేసీఆర్..
హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ పర్యటన మొత్తం రహస్యంగానే జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాంకా కదలికలపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు చివరి క్షణంలోనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చేవారని ఆయన చెప్పారు.
Recommended Video
హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే.
ప్రత్యేక విమానమని.. సాధారణ విమానంలో...
ఇవాంకా హైదరాబాద్ టూర్పై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని విషయాలు వెల్లడించారు. ముందుగా ఇవాంకా హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వస్తారని తమకు తెలిపారని కానీ చివరికి ఆమె సాధారణ విమానంలో వచ్చారని ఆయన పేర్కొన్నారు.
ముందు వెస్టిన్ అన్నారు.. తర్వాత చూస్తే...
అలాగే ఇవాంకా బస విషయంలోనూ అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు చివరి నిమిషం వరకూ రహస్యంగా ఉంచారని, తొలుత ఇవాంకా వెస్టిన్ హోటల్లో బస చేస్తారని చెప్పారని.. కానీ తీరా ఆమె హైదరాబాద్లో అడుగుపెడతారనగా బసను ట్రైడెంట్ హోటల్ కు మార్చేశారని కేసీఆర్ వెల్లడించారు.
గోల్కొండ కోట సందర్శన కూడా...
ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోట సందర్శనను సైతం అమెరికా అధికారులు చివరి వరకూ గోప్యంగా ఉంచారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు పనిచేశారని చెప్పారు.
హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది: సీఎం కేసీఆర్
హైదరాబాద్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్) విజయవంతంపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో పాటు అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మూడు రోజుల పాటు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేశాయని చెప్పారు. విజయవంతంగా ఈ సదస్సు నిర్వహించడం ద్వరా హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.