అప్పట్లో ఆంధ్రజ్యోతిలోనూ ప్రచురించారు.. ఆధారాలున్నాయి: జీవితపై పీవోడబ్ల్యూ సంధ్య
హైదరాబాద్: నటి శ్రీరెడ్డి లేవనెత్తిన 'కాస్టింగ్ కౌచ్' ఉద్యమానికి మహిళా సంఘాల నేతలు వెన్ను దన్నుగా నిలుస్తూ పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీవోడబ్ల్యూ నేత సంధ్య ఓ టీవి చానెల్ చర్చా కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సంధ్య ఆరోపణలపై భగ్గుమన్న జీవితా రాజశేఖర్.. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. నిరాధార ఆరోపణలతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తాను చేసిన ఆరోపణలకు తనవద్ద ఆధారాలున్నాయని బలంగా చెబుతున్నారు సంధ్య.
'మహాపతివ్రతా శిరోమణి: దమ్ముంటే జగన్, చంద్రబాబు తల్లుల్ని కూడా అలా తిట్టగలవా?'
అలా మాట్లాడారు కాబట్టే.
ఇండస్ట్రీలో నీకో.. నీ కూతురికో కాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎదురుకానంత మాత్రాన అంతా పవిత్రంగానే ఉందనుకోవడం పొరపాటని సంధ్య అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీకి మీరు ఎన్ని ఆశలతో అయితే వచ్చారో.. మీలాగే ఎంతోమంది ఆడపిల్లలు వస్తున్నారని గుర్తుచేశారు. తాము మోసపోయామని బాధిత మహిళలు ముందుకొచ్చి చెబుతున్నా.. క్యాష్ కమిటీ అవసరం లేదంటే దాని అర్థమేంటి అని ప్రశ్నించారు. ఆమె అలా మాట్లాడారు కాబట్టే.. తాను ఆ ఆరోపణలు చేయాల్సి వచ్చిందన్నారు.
ఏడేళ్ల క్రితం..
ప్రతీ మంగళ, శుక్రవారాల్లో తాను కౌన్సెలింగ్ ఇస్తానని సంధ్య ఈ సందర్భంగా చెప్పారు. ఆ క్రమంలో ఏడేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన జీవితా రాజశేఖర్ ల గురించి ఓ విషయాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఇద్దరమ్మాయిలు ఓ లెటర్ తీసుకుని తనను కలవడానికి వచ్చారని చెప్పారు.
ఆ సమయంలో వారిద్దరూ ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని తెలిపారు. అందులో ఒకమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చిన యువతి అని.. పాకెట్ మనీ కోసం ఎవరి ద్వారానో ఆమె నటుడు రాజశేఖర్ని కలిసిందని చెప్పారు. అప్పటికే ఆమె ఒక కమిట్మెంట్లో ఉందని, దాన్ని డీల్ చేసేది జీవిత అని తెలిసిందన్నారు. ఇది కాస్టింగ్ కౌచ్ కాదని, డైరెక్ట్ డీలింగ్.. అంటే ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకోవడం అని చెప్పుకొచ్చారు.
ఆధారాలా.. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో..
తనతో ఆ ఇద్దరమ్మాయిలు చాలా విషయాలు చెప్పారని సంధ్య అన్నారు. గత 30ఏళ్ల బాధితులెవ్వరినీ తాను మీడియా ముందుకు తీసుకురాలేదని, ఇప్పుడు కూడా వారిని మీడియా ముందుకు తీసుకురావడం ఇష్టం లేదని చెప్పారు. వారి భవిష్యత్తును దెబ్బతీయడం తనకు ఇష్టం లేదన్నారు.
ఆ ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి కజిన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారని, ఆయనతో చెప్పి పేపర్ లో వేయిద్దామని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో వసంతలక్ష్మి అనే జర్నలిస్టు బాధితుల గోడును నవ్య పేజీలో ప్రచురించారని అన్నారు. జీవిత ఆధారాలు అడుగుతున్నారు కాబట్టి.. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్లీ చూపిస్తామని అన్నారు.
ఆధారాలున్నాయి కాబట్టే..
ఆధారాలు ఉన్నాయా? అన్న సూటి ప్రశ్నకు.. 'అవే ఉన్నాయో.. ఇంకేవి ఉన్నాయో.. అన్నీ బయటకొస్తాయి.. ఉన్నాయి కాబట్టే చెబుతున్నాం' అని సంధ్య బదులిచ్చారు. ఆఖరికి జీవిత కూడా బాధితురాలేనని, ఆమెను రాజశేఖర్ తీవ్రంగా కొడుతాడని చాలామంది చెప్పినవాళ్లు ఉన్నారని సంధ్య వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండస్ట్రీలో జీవితం మీకే కాదు.. చిన్నవాళ్లకూ ఉందని గుర్తుచేశారు సంధ్య. వాళ్లనెందుకు హీనంగా చూస్తారని, ఇంకెంతకాలం వారిని దోపిడీ చేస్తారని ఆమె ప్రశ్నించారు.