గోవర్ధనగిరిధారిగా నారసింహుడు .. నేడు జగన్మోహిని గా అలంకరణ, ఎదుర్కోలు ఉత్సవం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆరు రోజులు పూర్తి చేసుకున్నాయి. విశ్వశాంతి, లోకకళ్యాణార్ధం నిర్వహించే ఉత్సవాల్లో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయా కాలాల్లో భక్తులను కాపాడేందుకు ఆవిర్భవించిన అవతారవిశేషాలను వివరించేందుకు నాటి అవతార అలంకార రూపాలను నృసింహుని సన్నిధిలో భక్తులకు కనువిందు చేసేలా నిత్యం అలంకరణలు చేస్తున్నారు. గోపకులంలో గోవర్ధనగిరిని ఎత్తి నందగోకులాన్ని రక్షించిన విధానం గురించి తెలియజేస్తూ స్వామి వారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. వటపత్ర సాయిగా దర్శనం కమనీయం .. నేడు గోవర్ధనధారిగా స్వామి
ఆశ్రిత రక్షకుడైన గోవర్ధనగిరిధారిగా నారసింహుడు
బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజున రోజున శ్రీ లక్ష్మీ నరసింహుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు కనువిందు చేశాడు. శ్రీవారి ఆలయంలో దివ్య ప్రబంధ పారాయణములు పారాయణీకులచే నిర్వహించారు. శ్రీవారికి గోవర్థనగిరిధారి అలంకారం గావించి భక్తులకు దర్శనం కలిగించారు. బృందావనంలో గోవర్ధనగిరి పర్వతం వద్ద కృష్ణపరమాత్మ నిర్వహించు గోపోత్సవం తిలకించుటకు రేపల్లెలోని ప్రజలందరూ చేరుకొనగా ఇంద్రుడు రాళ్ళ వర్షమును కురిపిస్తాడు. భయభ్రాంతులైన ప్రజలను రక్షించడానికి ఇంద్రుని గర్వాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణ భగవానుడు ఒక చేతిలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలురందరిని రక్షించిన తీరు అపూర్వం. ఏడు రోజులు కుండపోతగా ఇంద్రుడు కురిపించిన రాళ్ళ వర్షం నుంచి తన భక్తులను రక్షించిన తీరు భగవానుని ఆశ్రిత రక్షణను తెలియజేస్తుందని ఆలయ పండితులు ఈ అలంకరణ విశేషాలను తెలిపారు.
రాత్రి ఘనంగా స్వామి సింహ వాహన సేవ
ఇక రాత్రి వేళ స్వామి సింహవాహనం మీద బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చారు . ఒక్కోరోజు ఒక్కో అలంకారం లో స్వామి దర్శనం చూస్తున్న భక్తులు తరించిపోతున్నారు. స్వామి వారి సింహ వాహన సేవను భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించి తరించారు.
నేడు జగన్మోహినిగా స్వామి.. అట్టహాసంగా ఎదురుకోలు ఉత్సవం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారిని ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 11గంటల నుండి స్వామి జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు . అలాగే రాత్రి 9గంటలకు అశ్వ వాహన సేవ, అనంతరం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున విచ్చేసే అవకాశమున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను, భక్తిలకు మౌలిక సదుపాయాలను దేవస్థానం అధికారులు కల్పించారు .
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు యాదాద్రి వేదికగా బ్రహ్మోత్సవాలలో భాగంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భగవానుడి లీలను ప్రదర్శిస్తూ సాగిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిన్నారులు అద్భుతమైన ప్రదర్శనలతో వేడుకలకు మరింత కళ తీసుకువచ్చారు.