‘‘మంట పెట్టారుగా.. మరి బెదిరింపులు రావా?’’.., మాజీ గవర్నర్ రోశయ్య స్పందన ఇదీ...
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అని టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాల్సిం
హైదరాబాద్: 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అని టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు.
సోమవారం ఓ న్యూస్ ఛానెల్ వేదికగా ఐలయ్యతో మాట్లాడిన ఆర్యవైశ్య సంఘం నేతలు ఇటువంటి రాతలు రాస్తే ఏ సామాజిక వర్గం వారికైనా కోపం వస్తుందని అన్నారు. ఐలయ్య పెట్టిన మంట అలా ఉంది అని, అందుకే బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు.
తమతో కూర్చొని చర్చించి ఐలయ్య మనసులో ఉన్న ఆ భావాలను కడిగేసుకోవాలని వారు సూచించారు. భయపడాల్సిన అవసరం లేదని, కంచ ఐలయ్య మీద ఎవరూ దాడి చేయబోరని చెప్పారు.
స్పందించిన మాజీ గవర్నర్ రోశయ్య...
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య స్పందించారు.
ఈ పుస్తకంలోని అభ్యంతరాలపై ఐలయ్యతో ఆర్యవైశ్యులు చర్చించాలని, ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పుస్తకాలు రాయడం మంచిది కాదని అన్నారు. సంస్కృతి పరంగా సామాజికవర్గ ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని విమర్శించడం సరికాదని హితవు పలికారు. వృత్తి పరంగా వైశ్యులు వ్యాపారాన్ని ఎంచుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా రోశయ్య ప్రస్తావించారు.
రక్షణ కల్పించాలన్న అసదుద్దీన్ ఒవైసీ...
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు రచయిత, రిటైర్డ్ ఫ్రొఫెసర్ కంచ ఐలయ్యకు వెంటనే తగిన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఐలయ్యను బెదిరిస్తున్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
అంతకుముందు సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం నేపథ్యంలో తనకు ఆర్యవైశ్యుల నుంచి బెదిరింపులు, సందేశాలు వస్తున్నాయంటూ ఐలయ్య ఓయూ పోలీసులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అటు ఐలయ్యపై పంజాగుట్ట పిఎస్లో ఇప్పటికే ఫిర్యాదు నమోదైంది. న్యాయ సలహా తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని పోలీసులు తెలిపారు.