దారుణం: బెదిరించి 16ఏళ్ల బాలికపై సామూహిత అత్యాచారం
హైదరాబాద్: బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక... శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలోని తన సోదరి ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చింది.
సోమవారం బాలిక గ్రామ శివార్లకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన యువకులు చింతగారి బాల్రాజ్, తలారి ప్రభాకర్లు బాలికకు అడ్డుతగిలి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.
ఆ తర్వాత పాంబండ గ్రామంలోకి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో గ్రామ పెద్దలు సదరు యువకులను పిలిపించారు. బాలిక, యవకులు ఒకే కులానికి చెందడంతో ఇద్దరిలో ఒక యువకుడు పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు.
అయితే అలా చెప్పిన యువకుడు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి చెప్ప పెట్టకుండా గ్రామం నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బుధవారం శివ్వంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ సీఐ రమేష్బాబు తెలిపారు.
కుషాయిగూడలో విద్యార్థి ఆత్మహత్య
నగరంలోని కుషాయిగూడలో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుషాయిగూడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెంకటేశ్(14) 9వ తరగతి చదువుతున్నాడు. వెంకటేశ్ స్కూల్కు యూనిఫామ్ వేసుకోకుండా రావడంతో ప్రిన్సిపాల్ మందలించాడు.
దీనిని అవమానంగా భావించిన విద్యార్ధి ఇంటికి వచ్చిన తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.