గుండెపోటుతో యువ ఎస్సై మృతి, కారు ప్రమాదంలో మహిళ మృతి
హైదరాబాద్: గుండెపోటుతో ఓ యువ ఎస్సై మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఆర్. ఉమా మహేష్(29) 2012లో ఎస్సైగా ఉద్యోగంలో చేరాడు.
విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం నాడు బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఖానాపూర్కు వచ్చాడు. ఉదయం పూట ఒక్కసారిగా ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబ సభ్యులు అతడిని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక పాప ఉన్నారు. ఉమా మహేష్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
కారు ప్రమాదంలో మహిళ మృతి
వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళ మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఓ కారు కొడంగల్ శివారులో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న కర్ణాటకకు చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.