మిలాంజ్ టవర్ 9వ అంతస్తు నుంచి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్లోని మిలాంజ్ టవర్పై నుంచి దూకి గురువారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అదే భవనంలోని ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శ్రావణి(27)గా గుర్తించారు.
గురువారం ఉదయం ఆఫీసుకు వచ్చిన శ్రావణి.. మధ్యాహ్నం మిలాంజ్ టవర్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
శ్రావణి గత కొన్ని రోజులుగా తీవ్రమైన మనోవేదనకు గురవుతోందని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన భర్త రామకృష్ణతో కలిసి శ్రావణి మియాపూర్లో నివాసం ఉంటోంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు.
గత కొంత కాలంగా శ్రావణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోందని భర్త రామకృష్ణారెడ్డి పోలీసులకు తెలిపారు. ఇటీవల ఆస్పత్రిలో కూడా చూపించామని భర్తతోపాటు కుటుంబసభ్యులు చెప్పారు. కాగా, ఇటీవల నగరంలోని అబిడ్స్లో ఓ యువతి నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.