ఘోరం: పెళ్లికి నిరాకరించిందని యువతి గొంతుకోసి హత్య, పురుగుల మందుతాగి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దమ్మపేట మండలం నెమలిపేటలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపం ఓ యువకుడు.. విద్యావాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న యువతి గొంతుకోశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. నెమలిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యావాలంటీర్గా పనిచేస్తున్న ప్రవళికకి.. వరుసకు మేనమామ అయ్యే అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
శనివారం ఉదయం ప్రవళిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో కూడా వెంటపడి వేధించాడు. సాయంత్రం పాఠశాలలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో శ్రీనివాసరాజు మరోసారి పాఠశాల వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ప్రవళికని బలవంతపెట్టి బెదిరించాడు.
అమె తిరస్కరించడంతో ఆగ్రహించిన శ్రీనివాసరాజు కత్తితో పల్లవిపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడికక్కడే పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ప్రవళికని వివాహం నిశ్చయం కావడంతో కక్ష పెంచుకున్న శ్రీనివాసరాజు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.