బైక్ అంటే మోజు.. తండ్రి కొనివ్వనన్నాడు: ఎలాగైనా కొనాలని ఈ పనిచేశాడు..
హైదరాబాద్: అతనికి బైకులంటే యమా మోజు.. తండ్రిని కొనివ్వమంటే కొనివ్వలేదు. దీంతో ఎలాగైనా కొత్త బైక్ కొనుక్కోవాలన్న ఆశతో.. నాలుగు బైకులను దొంగిలించాడు. దొంగిలించిన బైకులతో షికార్లు చేస్తుండగా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ సిక్విలేజ్ గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఎండీ ఉస్మాన్ఖాన్కు ఎండీ అంజాద్ఖాన్(19) అనే కుమారుడు ఉన్నాడు. చదువు అబ్బకపోవడంతో కొన్నాళ్ల క్రితం స్థానికంగా ఉన్న ఒక మెకానిక్ షెడ్ లో పనికి కుదిరాడు.
ఈ క్రమంలో మెకానిక్ షెడ్కు వచ్చే పలు రకాల బైక్స్ను చూసి అతనికి మోజు పుట్టింది. షెడ్ నుంచి ఇంటికొచ్చి బైక్ కొనివ్వాలంటూ తండ్రిని బతిమాలేవాడు. కానీ ఆర్థిక పరిస్థితి కారణంగా తండ్రి బైక్ కొనివ్వలేకపోయాడు. దీంతో పాత బైకులను దొంగిలించి.. వాటిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో కొత్త బైక్ కొనాలనుకున్నాడు.
అలా నాలుగు బైకులను దొంగిలించి వాటిపై షికారు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల బైక్పై బోయిన్పల్లిలో షికార్లు చేస్తుండగా పోలీసులతనిఖీల్లో దొరికిపోయాడు. దొంగిలించిన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు చెప్పారు.