ఆ యువకుడు అక్కడా వదల్లేదు, గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చి..
వరంగల్: ఓ అమ్మాయి పరిచయం కావడంతో, ఆమె కోసం వచ్చిన ఓ యువకుడు అక్కడి ఇళ్లలో దోచుకున్న సంఘటన వరంగల్ జిల్లాలోని మానుకోటలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
గత కొద్దికాలంగా మహబూబాబాద్ పట్టణంలోని పలువురి ఇళ్లల్లో అతను చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 16 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
గత రెండు నెలలుగా మానుకోట పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితుల కోసం పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. శనివారం పట్టణంలోని ఇల్లందు బైపాస్ రోడ్డులోని వైయస్సార్ విగ్రహం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బోలిశెట్టి శ్రీనివాస్ను అనుమానంతో పట్టుకొని విచారించారు.
అతను తాను చేసిన నేరాలను అంగీకరించినట్లు డీఎస్పీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం పట్టణ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శ్రీనివాస్ బాల్యం నుంచే చోరీలకు అలవాటు పడి వివిధ ప్రాంతాల్లో చోరీకి పాల్పడి ఇప్పటికే పలుసార్లు జైలుకు వెళ్లాడు.
పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. కాగా, మానుకోటలో జరుగుతున్న చోరీలను అరికట్టడంతో పాటు అపహరణకు గురైన వస్తువులను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగిస్తామన్నారు. కాగా, అతను మానుకోటకు చెందిన అమ్మాయి పరిచయం కావడంతో ఖమ్మం నుంచి వచ్చాడు.