డబ్బిస్తావా, మనిద్దరి ఫోటోలు నెట్లో పెట్టాలా: యువతికి బ్లాక్మెయిల్
హైదరాబాద్: తనకు డబ్బులు ఇవ్వకుంటే మనిద్దరం ఏకాంతంగా ఉన్న ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని నేరేడ్మెట్ ప్రాంతంలో జరిగింది. నిందితుడి పేరు షేక్ నిజాముద్దీన్.
అతనిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పాత సఫిల్గూడకు చెందిన నిజాముద్దీన్ అయిదేళ్ల క్రిందట ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్లాడు. ఉద్యోగం రాలేదు. కానీ అక్కడ పని చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తాను అనాథనని చెప్పడంతో, ఆ యువతి అతని పట్ల సానుభూతి కనబర్చింది.
అదే అదనుగా పరిచయం మరింత పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని ఏడాది క్రితం చెప్పాడు. బాధితురాలు కూడా అంగీకరించింది. ఇద్దరు కలిసి ఆమె బంధువుల ఇళ్లకు, సినిమాలకు వెళ్లేవారు. ఇరువురు కలిసి ఏకాంతంగా కూడా గడిపారు.
తామిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నిందితుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. మరోవైపు కొద్ది రోజుల క్రితం యువతి పెళ్లి గురించి అడిగింది. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె అతని పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ కనిపించవద్దని హెచ్చరించింది.
దీంతో ఆమె పైన అతను కక్ష పెంచుకున్నాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే మనిద్దరం కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు నెట్లో పెడతానని బెదిరించాడు. ఆమె బంధువులకు కొన్ని చిత్రాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.