కత్తితో పొడిచి, రాడ్డుతో తలలో గుచ్చి చంపాడు: హైదరాబాద్ లో దారుణ హత్య..
హైదరాబాద్: హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు అతన్ని అత్యంత పాశవికంగా హత్య చేసినట్టు సమాచారం. కత్తితో పొడిచి, రాడ్డుతో కడుపులో గుచ్చి, ఆపై మృతదేహన్ని ఓ నీటి డ్రమ్ములో పడేసి పరారయ్యాడు నిందితుడు. హత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది?:
సూర్యాపేట జిల్లా అనాదుర్ నగర్కు చెందిన గువ్వల గిరి(34) కొన్నాళ్లుగా వనస్థలిపురం పనామ సమీపంలోని రైతుచికెన్ బజార్ ఎదుట ఛాయ్ బండిని నడుపుతున్నాడు. గురువారం మధ్యాహ్నం గిరి అనే మరో యువకునితో కలిసి మద్యం సేవించి దుకాణం వద్దకు వచ్చాడు.
అక్కడే హత్య..:
చికెన్ షాపు మూసి ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న మరో దారి గుండా లోపలికెళ్లారు. అక్కడ ఒకరిని ఒకరు తీవ్ర దుర్భాషలాడుకున్నట్టు తెలుస్తోంది. ఏదో విషయమై ఇద్దరి వాగ్వాదం తలెత్తగా.. బయటకొచ్చిన గిరి కత్తి తీసుకుని మళ్లీ లోపలికి వెళ్లాడు. కుర్చీలో కూర్చొని ఉన్న ఆ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో కడుపులో పొడిచాడు.
రాడ్డుతో విచక్షణారహితంగా.:
కత్తితో దాడి చేసినప్పటికీ.. ఆగ్రహం చల్లారక రాడ్డుతోనూ దాడి చేశాడు గిరి. బయటకొచ్చి ఓ ఇనుపరాడ్డు తీసుకుని మళ్లీ లోపలికి వెళ్లిన గిరి.. ఆ యువకుడి తలపై దాన్ని బలంగా గుచ్చాడు. ఆపై కడుపులో పొడిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. యువకుడు చనిపోయాక మృతదేహన్ని పక్కనే ఉన్న ఖాళీ నీటి డ్రమ్ములో పడేసి పరారయ్యాడు.
అదుపులో నిందితుడు..:
స్థానికుల సమాచారం మేరకు ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్ తో కొన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుడైన గువ్వల గిరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గిరి నోరు విప్పితే హత్య వెనుక అసలు కారణాలు బయటపడే అవకాశం ఉంది. కాగా, గిరి దాడిలో మృతి చెందిన యువకుడిని వైజాగ్కు చెందిన కృష్ణచైతన్య(30)గా గుర్తించారు.