విషాదం : క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య.. అదే కారణం..
వ్యాపారం పెట్టేందుకు ఇంట్లో వాళ్లు డబ్బులు ఇవ్వట్లేదన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా ఉప్పరిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కళావతికి ఇద్దరు రాజేష్,మహేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేష్ వ్యవసాయం చేస్తుండగా.. రాజేష్(22) ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. కొంతకాలంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని రాజేష్ ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ఇటీవల తల్లి కళావతిని డబ్బులు అడిగాడు. అయితే కొద్ది రోజుల క్రితమే కళావతి,మహేష్ రూ.4లక్షలు అప్పు చేసి గ్రామంలో భూమి కొన్నారు.
లాక్ డౌన్ వేళ పని కూడా లేకపోవడంతో చేతిలో డబ్బు లేదని.. ఇలాంటి సమయంలో బిజినెస్లు వద్దని కళావతి రాజేషన్ను వారించింది. కొద్దిరోజులు పోతే పరిస్థితులు చక్కబడుతాయని.. అప్పుడు బిజినెస్ ప్రారంభిస్తే మంచిదని చెప్పింది. అయితే రాజేష్ మాత్రం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో వాళ్లు తనకు సహకరించట్లేదని కలత చెందాడు. అంతేకాదు,నిత్యం తల్లి,అన్నలతో గొడవపడేవాడు.
ఇదే క్రమంలో సోమవారం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. అక్కడ ఎండిపోయిన పొదలకు నిప్పు పెట్టాడు. క్షణికావేశంలో అదే మంటల్లో దూకేశాడు. మంటలను గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఫైరింజన్లు వచ్చేసరికి రాజేష్ శరీరం పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. సంఘటనా స్థలం సమీపంలోనే మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.