కూతుళ్లను బంధువు ఇంటికి పంపి ఇంట్లో ప్రియుడితో మహిళ, నిఘా వేసి చంపేసిన భర్త
సంగారెడ్డి: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 12వ తేదీన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మృతుని వదిన తన మరిది ఎల్లయ్య (23) కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.
కానీ, అతను జోగిపేటలో విగతజీవిగా కనిపించాడు. పదిహేడు రోజుల తర్వాత ఆలస్యంగా శనివారం నాడు అతని మృతదేహం లభ్యమైంది. మహిళతో అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.
అలా పరిచయం ఏర్పడింది
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఎల్లయ్య అనే యువకుడు సంగారెడ్డిలోని ఓ టెంట్ హౌస్లో పని చేస్తున్నాడు. జోగిపేటకు చెందిన పాపయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పాపయ్య జోగిపేటలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఎల్లయ్య అప్పుడప్పుడు పాపయ్య ఇంటికి వెళ్లేవాడు.
అతని భార్యతో వివాహేతర సంబంధం
ఈ క్రమంలో పాపయ్య భార్య అక్కమ్మతో ఎల్లయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురి ప్రవర్తనపై పాపయ్యకు అనుమానం వచ్చింది. ఎల్లయ్య, భార్య అక్కమ్మపై నిఘా పెట్టాడు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన అక్కమ్మ జోగిపేటలో నివసించే కూతుళ్ల వద్దకు వచ్చింది. ఈ విషయం ఎల్లయ్యకు తెలిసింది. దీంతో అతను అక్కడకూ వచ్చాడు.
రాత్రి కూతుళ్లను బంధువు ఇంటికి పంపి ప్రియుడితో
రాత్రి సమయంలో ఆమె తన కూతుళ్లను వారి బంధువు ఇంటికి పంపించింది. ఎల్లయ్యతో ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పటికే పాపయ్య నిఘా వేశాడు. ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ భార్య, ఎల్లయ్యను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఎల్లయ్య అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచాడు. విషయాన్ని బంధువుకు చెప్పి, ఇద్దరు కలిసి మృతదేహాన్ని సంచిలో వేసుకొని, పట్టణ శివారులో పడేశారు. మరుసటి రోజు మరిది ఇంటికి రాకపోవడంతో ఎల్లయ్య వదిన ఫిర్యాదు చేసింది.
మరో కోణం... కాబోయే అత్తతో..
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు. వివాహేతర సంబంధం బయటపడింది. పాపయ్యను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇక్కడ మరో ప్రచారం కూడా సాగుతోంది. ఎల్లయ్యకు అక్కమ్మ కాబోయే అత్తగా తెలుస్తోంది. కూతురును చూడటానికి వచ్చి అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తోంది. భార్య, కాబోయే అల్లుడి బాగోతం తెలిసి అతను చంపేశాడు.