అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి
మిర్యాలగూడ: సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు కేసు గురించి మాట్లాడాడు. అమృత పైన ప్రేమతోనే హత్య చేయించానని చెప్పాడు. పోలీసులు మారుతిరావు, అమృత బాబాయి శ్రవణ్ కుమార్లను విచారించారు. విచారణలో పలు అంశాలను వారు చెప్పారని తెలుస్తోంది.
చదవండి: ప్రణయ్ని నయీమ్ బ్యాచ్తో మా నాన్నే చంపించారు, మొదట్నుంచీ.. : అమృత కన్నీటిపర్యంతం
తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధపడే హత్యకు ప్లాన్ వేశానని చెప్పాడని తెలుస్తోంది. ముందుగానే రూ.5 లక్షల సుఫారీ ఇచ్చానని చెప్పాడు. తన కూతురు అమృతకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని సుఫారీ గ్యాంగ్ను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
చదవండి: హత్యకు 3నెలల నుంచి ప్లాన్: కూతుర్ని వదిలేస్తే రూ.3 కోట్లు.. ప్రణయ్కి అమృత తండ్రి ఆఫర్?
9వ తరగతిలోనే చెప్పా
తొమ్మిదో తరగతిలోనే ప్రణయ్, అమృతలకు చెప్పినా వినలేదని తండ్రి మారుతీరావు తెలిపాడు. తన కుమార్తె జోలికి రావొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్ వినలేదన్నాడు. అతనిని చంపించినందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నాడు. ఈ సందర్భంగా హత్యకు దారితీసిన కారణాలను అతను వివరించాడని సమాచారం.
తండ్రి ఏ1 నిందితుడు
ప్రణయ్, అమృత వర్షిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లయి ఏడెనిమిది నెలలు అవుతోంది. అమ్మాయి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి గర్భిణీ. శుక్రవారం అమృతను తీసుకొని భర్త ప్రణయ్, అతని తల్లి ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో అమృత తండ్రి ఏ1 నిందితుడిగా ఉన్నాడు. హత్య గురించి అతను పెదవి విప్పాడు.
పలుమార్లు కౌన్సెలింగ్
ప్రణయ్, అమృతల ప్రేమ వివాహంపై అమ్మాయి తండ్రి మారుతి రావుకు కౌన్సెలింగ్ ఇచ్చామని, కానీ అతను ఇంత దారుణానికి ఒడిగడతాడని తాము భావించలేదని పోలీసులు తెలిపారు. ఇది పరువు హత్యనే అన్నారు. అమ్మాయి తండ్రితో పలువురు రాజకీయ నాయకులు కూడా మాట్లాడి, వారి ప్రేమను అంగీకరించాలని చెప్పారని తెలుస్తోంది.
ఇద్దరిదీ ఒకే పట్టణం
మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన బాలస్వామి, ప్రేమలతల కుమారుడు ప్రణయ్. అతని వయస్సు ఇరవై నాలుగు. మిర్యాలగూడకే చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతీరావు కుమార్తె అమృత పదోతరగతి నుంచి స్నేహితులు. జనవరిలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఇరుర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అమృత తన భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు చెప్పడంతో, అప్పటి నుంచి తన భర్త ఇంటి వద్దే ఉంటోంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత ఇటీవలే వరుడి తల్లిదండ్రులు మిర్యాలగూడలో డిన్నర్ ఏర్పాటు చేయగా అమ్మాయి తరఫు బంధువులు హాజరుకాలేదు.