ఎంపీ అరవింద్ ర్యాలీలో తల్వార్లతో యువకుల హల్చల్... సుమోటో కేసు,ఏడుగురి అరెస్ట్...
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా పర్యటన స్థానికంగా కలకలం రేపింది. రాయికల్ మండలం అల్లిపూర్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హల్చల్ చేశారు. యువకులు వీధుల్లో తల్వార్లు తిప్పుతూ హల్చల్ చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Recommended Video
డీజే హోరులో యువకులు తల్వార్లు తిప్పుతూ నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇక్కడ తల్వార్ తిప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎంపీ అరవింద్ గానీ స్థానిక బీజేపీ కార్యకర్తలు గానీ ఇంతవరకూ స్పందించలేదు.
అంతకుముందు,టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు జగిత్యాలలో ఏం పని? బోర్నపల్లి బ్రిడ్జి మీద కవిత మోడలింగ్ చేశారా? రంగు రంగుల చీరలు కట్టుకుని ఆ ఫొటోలు ఎందుకు?' అని అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారని... అసలు ముఖ్యమంత్రి మాత్రం కనపడడని ఎద్దేవా చేశారు. మిగతా ముగ్గురు మాత్రం సంపాదనలో పోటీ పడుతున్నారని విమర్శించారు.