తెలంగాణ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర..! సోషల్ మీడియాలో వినూత్న ప్రచారం..!!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రాజకీయ నేతలు తమతమ గెలుపుపై ద్రుష్టి సారించారు. రోడ్ షోలు, ఇంటింటికి ప్రచారం, బస్తీ సభలు నిర్వహిస్తూ బిజిబిజి గా మారిపోయారు. నియోజక వర్గ ప్రజలకోసం తాము చేసిన,చేయబోతున్న పనులను ఏకరువు పెడుతున్నారు. మరో అవకాశం ఇస్తే ఇంతకన్నా సుపరిపాలన అందిస్తామంటూ వాగ్దానలు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే తెలంగాణ రాజకీయ నేతల పట్ల యువత కీలర భూమిక పోషించబోతున్నారు. తమ భావి రాజకీయ నేతను ఎంచుకునేందుకు తమవంతు క్రిషి చేస్తామంటున్నారు తెలంగాణ యువత.
తెలంగాణలో యువత ఓట్లే కీలకం..! నేతలను నిర్ణయించే దిశగా కార్యాచరణ..!
తెలంగాణలో జరుగనున్న ముందస్తు ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో యువత ఓట్లు రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపనున్నాయని వారు స్ఫష్టం చేస్తున్నారు. అందుకే ప్రతి పార్టీ తన మేనిఫెస్టోలో యువతకు ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా గుర్తించి ప్రజలు పట్టం కట్టిన సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ల సుదీర్ఘ పొరాటం అనంతరం టీఆర్ఎస్ తెలంగాణను సాధించి తర్వాత రాజకీయ శక్తిగా ఎదిగింది.
అదికార పార్టీకి యువత అండగా ఉంటుందా..! మంచి నేతలను ఎన్నుకొనే దిశగా ప్రణాళికలు..!!
అయితే గడిచిన నాలుగున్నరేళ్లలో టిఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు యువతను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే వాదన వినిపిస్తుంటుంది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు యువతకు ఉద్యోగాల కల్పనలో నిరాశే ఎదురైందని విద్యార్థి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. దీనికితోడు రానున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకమని గ్రహించిన అన్ని రాజకీయ పార్టీలు యువతను ఆకట్టుకునేందుకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనే లక్ష్యం అనే కొత్త నినాదంతో తిరిగి ఎన్నికల బరిలోకి దిగాయి.
యువతకోసం అనేక పథకాలు..! ఎన్నికల్లో ఫలితాలు ఇస్తాయా..?
ఇంతకుముందు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కార్మికులు, కర్షకులు, కుల, మతాల ప్రాతిపదికన ఎన్నికల ప్రచారంతోపాటు ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాయి రాజకీయ పార్టీలు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ నేతలు తాపత్రయ పడుతున్నారని సమాచారం. మరోవైపు యువతకూడా గత తప్పిదాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ నాయకుడిని ఎన్నుకోవాలని ఆలోచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే పార్టీలతో ఏమాత్రం సంబంధం లేకుండా అభ్యర్థి నిజాయితీని గుర్తించి తమ సత్తా చాటేందుకు యువత సిద్ధమవుతున్నదని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వినూత్న ప్రచారం..! యువత మాటే వేదమత్రం..!!
రాజకీయ పార్టీలు చూపించే తాయిలాలు కాకుండా ప్రజలకోసం కోసం పని చేస్తూ, వారికి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకునేందుకు యువత మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగా సోషల్ మీడియాలో కొంతమంది యువత పార్టీలకు అతీతంగా ప్రజలను చైతన్య వంతం చేస్తున్నారని తెలుస్తోంది. ఓటర్లు ప్రలోభాలకు లోంగిపోకూడదని, డబ్బులకు అమ్ముడుపోవద్దనే సందేశం వ్యాపింపజేస్తున్నారు. దీనికితోడు పోలీసులు, ఎన్నికల అధికారులకుతోడు చైతన్యవంతులైన యువత కూడా నాయకుల అవినీతి చర్యలకు అడ్డకట్టు వేసే ప్రయత్నం చేస్తున్నారు.