పెద్దలు అంగీకరించలేదని ఘోరం: ప్రియురాలిని చంపి, ప్రియుడి ఆత్మహత్య
కరీంనగర్/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Recommended Video
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మరణాలతో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఐదేళ్లగా ప్రేమించుకుంటున్నారు..
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం అనంతారానికి చెందిన వొల్లాల ఎల్లయ్య-భారతమ్మల చిన్న కొడుకు మధు(25) హైదరాబాద్లోని ఓ బ్రెడ్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరి ఇంటి సమీపంలోనే ఉండే మిట్టపల్లి వెంకటమ్మ కుమార్తె సుస్మిత(22) బీఈడీ చదువుతోంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లికి ఒప్పుకోని యువతి తల్లి
కాగా, సుష్మిత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరుకావడం, కూతురు పుట్టినప్పుడే తనను భర్త వదిలేసి వెళ్లటం.. తనలాగే కూతురి జీవితం కాకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, వీరు దూరంగా ఉంటున్నట్లు నమ్మించేందుకు మధు హైదరాబాద్కు వెళ్లాడు.
సుస్మితను మధు ఫోన్
అయితే, గురువారం సిద్దిపేటలో మధు స్నేహితుడి వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన మధు సుస్మితకు ఫోన్ చేశాడు. అప్పటికే కళాశాలకు వెళ్లిన సుస్మిత అనుమతి తీసుకొని.. ఎప్పుడూ కలుసుకునే ముస్కాన్పేటలోని కోళ్లఫారం వద్దకు వెళ్లింది. మధు కూల్డ్రింక్, క్రిమిసంహారక మందు తీసు కొచ్చాడు.
ఒప్పుకోకపోవడంతో సుస్మితను చంపేశాడు
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో కలసి చనిపోదామని మధు ఆమెకు చెప్పాడు. అయితే, సుస్మిత ఇందుకు నిరాకరించి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, మధు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్నుపోయింది. తర్వాత ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు.
మిత్రులు వెళ్లేసరికే.. మధు కూడా
ఆ తర్వాత అతను కూడా కోళ్లఫారంలో దూలానికి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందే విషయాన్ని సిద్దిపేటలోని స్నేహితుడికి అతడు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. స్నేహితులు వచ్చి చూడగా, ఇద్దరూ శవాలై కనిపించారు. ఇరువురి కుటుంబాలకు వారు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.