స్వీట్ షాపులో మర్డర్... వివాహేతర సంబంధం... ఆమె కళ్ల ముందే హత్య...
వాళ్లిద్దరూ ఒకే షాపులో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే మహిళను ఇష్టపడ్డారు. పైగా ఆమె ఓ వివాహిత. కొంతకాలంగా ఆమె కోసం ఇద్దరు తరుచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా షాపులోనే ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఆ మహిళ ముందే కొట్టుకున్నారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని మధురానగర్లో ఉన్న శివారెడ్డి స్వీట్ షాపులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగింది...
మధురానగర్లోని శివారెడ్డి స్వీట్ షాపులో చాలాకాలంగా శ్రీనివాస్,గౌస్ అనే ఇద్దరు పనిచేస్తున్నారు. శ్రీనివాస్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం కాగా బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తమ జిల్లాకే చెందిన ఓ మహిళతో శ్రీనివాస్కు పరిచయం ఏర్పడింది. తనతో పాటే స్వీట్ షాపులో పనిచేసే గౌస్ కూడా ఆమెతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె ముందే ఘర్షణ...
ఆమెతో వివాహేతర సంబంధానికి సంబంధించి ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం(అగస్టు 26) ఎప్పటిలాగే ఇద్దరూ ఉదయాన్నే షాపుకు వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ మహిళ కూడా అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆమె విషయమై మరోసారి గొడవ మొదలైంది. అది కాస్త ఇద్దరూ పిడిగుద్దులు కురిపించుకునే దాకా వెళ్లింది. గౌస్ విచక్షణారహితంగా శ్రీనివాస్పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
భారీగా గుమిగూడిన జనం
పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు గుర్తించారు. హత్య విషయం తెలిసి చుట్టుపక్కల జనం భారీగా స్వీట్ షాపు వద్దకు వచ్చారు. పోలీసులు వారిని చెదరగొట్టి పంపించేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.