గల్లీ, యూత్ లీడర్లు సైతం.. మున్సిపల్ పోరుకు సన్నద్ధం.. ఈసారి రసవత్తర పోటీయేనా?
హైదరాబాద్ : మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమవుతోంది. వార్డుల విభజన ప్రక్రియ పూర్తయి.. నోటిఫికేషన్ రావడమే తరువాయి. అయితే ఈసారి ఎన్నడూలేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో యువత హవా కనిపించనుంది. ఇదే మంచి అవకాశమని భావిస్తున్న చాలామంది యువకులు కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు సై అంటున్నారు. ఆయా పార్టీల కార్యకర్తలు, గల్లీ లీడర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, యూత్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు.. ఇలా చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈసారి మున్సిపల్ పోరు రసవత్తరంగా మారనుంది. ఆయా పార్టీల్లో ఎప్పటినుంచో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నవారు మున్సిపల్ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. ఆ మేరకు మూడు నాలుగేళ్ల నుంచి ప్రజల్లో తిరుగుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మేము సైతం పోటీకి సై అంటూ మరి కొంతమంది యువకులు ముందుకు రావడంతో కంగుతింటున్నారు.
టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావు
మున్సి'పల్స్' దక్కెదెవరికో.. ఒక్క ఛాన్స్ కోసం
మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. పట్టణాల్లో ఏ నలుగుర్ని కదిలించినా అదే టాపిక్. ఇక సంతలోనో, ఛాయ్ హోటల్ దగ్గరనో కలిస్తే అంతా కుశలమేనా అని అడిగే బదులు.. కౌన్సిలర్గా పోటీ చేస్తున్నావా అని ఒకరినొకరు పలుకరించుకునే సందర్భాలు ఎక్కువవుతున్నాయి. ఇక వాట్సాప్ గ్రూపుల్లో హడావిడి అంతా ఇంతా కాదు.
కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీ టికెట్లు ఆశించేవారు ఆ మేరకు నేతల చుట్టూ ప్రదక్షణిలు చేస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నవారు ఇప్పటినుంచే తాము పోటీలో ఉండబోతున్నామని ఇండికేషన్ ఇస్తున్నారు.
ఖద్దర్ చొక్కా.. కౌన్సిలర్ గిరి.. మేము సైతం..!
మున్సిపల్ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. ప్రధపార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో ఆయా యూత్ సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా వార్డుల్లో గణేశ్, దేవి నవరాత్రులను ఘనంగా నిర్వహించే మండపాల నిర్వాహకులు కూడా సమరానికి సై అంటున్నారు. ఆయా ఉత్సవాల సందర్భంగా వార్డు ప్రజల మెప్పు పొందేలా కార్యక్రమాలు నిర్వహించామని.. అది తమకు కలిసొచ్చే అంశమని భావిస్తూ మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నారు.
ఇక స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు. కొద్దికాలంగా ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ నలుగురి నోళ్లల్లో నాని ఇప్పుడు కౌన్సిలర్లుగా గెలిచేందుకు ఆరాటపడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ తాము చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు తమ విజయానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు.
ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరం
ఈసారి పోటీ ఎక్కువే.. ప్రధాన పార్టీల అభ్యర్థులు పరేషాన్
పోయినసారి పోటీచేసి గెలిచినోళ్లు, అప్పుడు ఓడిపోయినోళ్లు.. ఎప్పటికైనా కౌన్సిలర్గా గెలవాలని కలలుగన్నోళ్లు.. ఆయా పార్టీల చోటామోటా లీడర్లు.. ఇలా ఇప్పటికే ఆశావహుల లిస్ట్ చాంతాండంతా ఉంటోంది. ఇక ఈసారి కుల, యువజన, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, గణేశ్ దేవి నవరాత్రుల మండపాల నిర్వాహకులు తాము సైతం పోటీకి సై అంటుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెలు గుభేల్మంటున్నాయి. ఇదివరకు ఓ వార్డులో ముగ్గురు నుంచి ఐదుగురి మధ్య పోటీ కనిపించేది. అయితే మారిన పరిస్థితుల కారణంగా ఈసారి మాత్రం ఆ సంఖ్య పదికి పైగా చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
కొన్నిచోట్ల పోటీ చేయాలని ఆశపడుతున్నవారిని డ్రాప్ చేయించేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే బేరసారాలు సాగించి వారికి అడ్డుకట్ట వేయాలని ప్లాన్ వేస్తున్నారట. అంతో ఇంతో ముట్టజెప్పి వారిని తమవైపు తిప్పుకుంటే కాస్తో కూస్తో ఓట్లు కలిసొస్తాయని భావిస్తున్నట్లు సమాచారం.
రిజర్వేషన్ల ప్రక్రియపై ఉత్కంఠ.. జనాల్లో తిరుగుతూ..!
అదలావుంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఏ వార్డుకు ఏ కేటగిరీ దక్కుతుందోననే టెన్షన్ మొదలైంది. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు రిజర్వేషన్లపై మధనపడుతున్నారు. తాము పోటీకి సై అంటున్నా.. రిజర్వేషన్ తేడా కొడితే అవకాశం పోతుందని ఆందోళన చెందుతున్నారు. దాంతో కొందరు రెండు, మూడు వార్డులపై దృష్టి పెట్టారు. ఆయా వార్డుల్లోని ప్రజలతో మమేకమవుతూ పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్నట్లు సంకేతాలిస్తూ ముందుకెళుతున్నారు.
ఇక రిజర్వేషన్లు ఖరారైతే చాలు.. నోటిఫికేషన్ రాకున్నా ప్రచారం ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ తర్వాత వెనువెంటనే ఎన్నికలు జరగనుండటంతో ప్రచార కార్యక్రమాలకు అంత సమయం ఉండదని భావిస్తున్నారు. ఆ క్రమంలో వార్డుల్లో తిరుగుతూ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
ఏ వార్డులో ఓటరో.. అదే వార్డులో పోటీ చేయాలి
అదంతా ఒక ఎత్తైతే ఎన్నికల సంఘం ఇచ్చిన ఝలక్ కొందరికి గుబులు పుట్టిస్తోంది. ఈసారి కౌన్సిలర్గా ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో కొందరు రెండు మూడు వార్డులపై దృష్టి పెట్టారు. అయితే పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత వార్డులో ఓటరుగా నమోదై ఉండాలనే రూల్ ఇబ్బందికరంగా మారింది. ఏ వార్డులో ఓటరుగా నమోదై ఉంటారో అదే వార్డు నుంచి పోటీ చేసేందుకు అర్హులని తెలిపింది. అలాగే అభ్యర్థులను ప్రతిపాదించే సభ్యులు కూడా అదే వార్డుకు చెందినవారై ఉండాలి. ఈ నిబంధన కొత్తగా పోటీచేయాలనుకునే అభ్యర్థులకు కాసింత ఇబ్బందికర పరిణామామనే చెప్పాలి.