ఆరోగ్యంపై యువతకు బాలకృష్ణ పిలుపు: కన్నీళ్లొస్తున్నాయంటూ రష్మిక మందన్న
హైదరాబాద్: యువత ఆరోగ్యంగాపై శ్రద్ధ వహించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ, నటి రష్మిక మందన్న పాల్గొన్నారు.
చిన్నారులు వ్యాధిన పడటం బాధాకరం
ఈ సందర్భంగా క్యాన్సర్ను జయించిన పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అభం శుభం తెలియని చిన్నారులు క్యాన్సర్ వాధి బారిన పడటం బాధాకరమని అన్నారు.
క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే..
చెడు అలవాట్ల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వస్తుందని అన్నారు. ప్రతి ఏడాది 50వేల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్యులు చెప్పారని తెలిపారు. చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్కు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. బసవతారకం తరపున సేవ చేస్తున్న వైద్యులను ప్రశంసించారు. మార్చి నెల 13న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఆ భయాన్ని జయించాలి..
క్యాన్సర్ వ్యాధికంటే ముందే మనల్ని చంపేది.. దాని పట్ల ఉన్న భయమేనని అన్నారు. అందుకే ఆ భయాన్ని జయించాలని అన్నారు. పిల్లలు భగవంతుడితో సమానం.. అలాంటి వారు క్యాన్సర్ బారిన పడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ వైద్యం అందరికి అందుబాటులో ఉండాలనేది తన మాతృమూర్తి అభిలాష అని, తక్కువ ఖర్చుతో ఈ వైద్యం అందించాలని కోరుకున్నారని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్ బాధితులకు సేవ చేస్తున్న నర్సులను ఆయన అభినందించారు. ఆస్పత్రికి సహకరిస్తున్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కన్నీళ్లువస్తున్నాయంటూ రష్మిక
సినీ నటి రష్మిక మందన్న మాట్లాడుతూ.. క్యాన్సర్ను జయించిన చిన్నారులను చూస్తుంటే సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయన్నారు. వారే రేపటి హీరోలు అని ఆమె వ్యాఖ్యానించారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన చిన్నారులను వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.