మంథని మధుకర్ మృతిలో ట్విస్ట్: హత్యనా, ఆత్మహత్యనా? 'గాయాల్లేవన్నారు'
మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ అనుమానస్పద మృతిపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుపుతామని పెద్దపల్లి డీసీపీ విజయేందర్ రెడ్డి తెలిపారు.
మంథని: మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ అనుమానస్పద మృతిపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుపుతామని పెద్దపల్లి డీసీపీ విజయేందర్ రెడ్డి తెలిపారు. మంథని పోలీసు పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు.
మధూకర్ మృతిపై సామాజిక మాద్యమాల్లో ఊహగానాలు, స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను పెద్దపల్లి ఏసీపీకి అప్పగించామన్నారు. కేసు పునర్విచారణలో భాగంగా ఏసీపీ ఖానాపూర్ వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి కొందరిని విచారించారన్నారు.
మృతదేహానికి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని దీనికోసం మంథని తహసీల్దారుకు బాధ్యతను అప్పగించామన్నారు. శవపరీక్షకు న్యాయమూర్తిని కూడా హాజరు కావాలని కోరినట్లు వివరించారు.
కనిపించే గాయాలు లేవు
తొలిసారి నిర్వహించిన పరీక్ష నివేదిక అందిందని, ఇందులో శరీరంపై బయటకు కనిపించే గాయాలేవీ లేవని వైద్యులు పేర్కొన్నారని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, యువతితో కూడా మాట్లాడుతామన్నారు.
వాంగ్మూలం తీసుకున్నారు
ఖానాపూర్ గ్రామానికి వెళ్లి మధుకర్ మృతి చెందిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం ఖానాపూర్కు చెందిన బానేష్, సతీష్, సమ్మయ్య, శ్రావణ్ కుమర్ల నుంచి ఏసీపీ ఘటనపై వివరాలు సేకరించారు. వారి వాంగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా తీసుకొని, వీడియో తీశారు. వాగ్మూలం ఇచ్చినవారి మాటలను రికార్డు చేయడం జరిగిందని దీనిలో ఎలాంటి పొరపాటు ఉండదని చెప్పారు.
కాగా, ప్రేమ వ్యవహారంలో అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన యువకుడు మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఓ అమ్మాయిని ప్రేమించినందుకే అతడి మర్మాంగాలు కోసి, కళ్లు పీకి దారుణంగా హత్య చేశారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళనలు చేశారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రీ పోస్టుమార్టం కోసం మంథని తహసీల్దారుకు సోమవారం నివేదించినట్లు డీసీపీ కే విజేందర్ రెడ్డి తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో రీపోస్టుమార్టం జరిపించనున్నారు.
ఏం జరిగిందంటే..
మృతదేహం దొరికిన మార్చి 14కు ముందు రోజు (13వ తేదీన) మధుకర్ వెంకటాపూర్కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఖానాపూర్కు చెందిన వ్యక్తి మధుకర్ను బైక్పై తీసుకెళ్లి యువతి తల్లిదండ్రులకు అప్పగించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు మధుకర్ ఇంటికి రాలేదంటున్నారు.
14వ తేదీన సదరు యువతి ఫోన్ చేయగా మధుకర్ సోదరుడు సమ్మయ్య లిఫ్ట్ చేశాడని, మధుకర్ కోసం వాకబు చేసి.. మీ ఇంటి పక్కనే ఉన్న కాలువ పక్కన వెతకమని చెప్పిందని అంటున్నారు. ఆ యువతి గ్రామానికే చెందిన మరో వ్యక్తి చెప్పిన చోటే మధుకర్ మృతదేహం దొరికిందంటున్నారు.
ట్విస్ట్.. ఆత్మహత్య కోణంలోను అనుమానం
వెంకటాపూర్కు వెళ్లిన తర్వాత మధుకర్ తాను ప్రేమించిన యువతిని కలిసిన తర్వాత ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారా? లేకపోతే ఖానాపూర్ శివారులోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారా? అన్నది తేలాల్సి ఉందని చెబుతున్నారు.
మొత్తానికి ఆ యువతి కూడా పురుగుల మందు తాగడంతో కరీంనగర్లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. తన తండ్రి మధుకర్ను దూషించినట్లు యువతి మెజిస్ట్రేట్ ఎదుట చెప్పారని తెలుస్తోంది. మధుకర్ది హత్యనా, ఆత్మహత్యనా విచారణలో తేలుతుందని చెబుతున్నారు.