కెసిఆర్ మాటల మరాఠీ, పిట్టల దొర: మందకృష్ణ, కాంగ్రెస్ నేతల ఫైర్
కరీంనగర్/ హైదారబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాటల మరాఠి, పిట్టల దొర అని ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బీహార్లో బీజేపీకి ఇచ్చిన షాక్లాగే తెలంగాణలో టీఆర్ఎస్కు ఇస్తారన్నారు. తెలంగాణలో దళితులు దగాకు గురవుతున్నారని, తమను మాదిగలను అణగదొక్కేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆయన కరీంనగర్లో అన్నారు. అందులో భాగంగానే మాదిగలను పరిపాలనకు దూరం చేశారని మంద కృష్ణ ఆరోపించారు.
దేశంలో నియంతృత్వానికి తావులేదని బీహార్ ప్రజలు నిరూపించారని కాంగ్రస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది సెక్యులర్ వాదుల విజయమని అభివర్ణించారు. మోడీలాగనే వరంగల్ ఉప ఎన్నికల్లో కేసీఆర్కు కర్ర కాల్చి వాత పెడతారని ఆయన చెప్పారు. ఉద్యమంలో పెద్దన్నపాత్ర పోషించిన కోదండరాంను పక్కనపెట్టారని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ ఫాసిస్టు విధానాలతో రాజకీయ విలువలను తొంగలో తొక్కుతున్నారని శ్రవణ్ ఆరోపించారు.
బిజెపి ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా బిహార్ ప్రజల తీర్పునిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. కేసీఆర్ కూడా మోడీ లాగా నియంతృత్వ పోకడలతో పనిచేస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదుగుతారనే రాజయ్యను బర్తరఫ్ చేశారని ఆయన విమర్శించారు. బీహార్ ఫలితాలు వరంగల్ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మోడీలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులోని ఎంబీభవనలో ఆశావర్కర్ల సంఘీభావ సభలో ఆయన మాట్లాడారు. ఆశావర్కర్లు 69 రోజులుగా సమ్మె చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తాను చెప్పిందే వినాలన్న మోదీకి బిహార్ ప్రజలు బుద్ధి చెప్పారని తమ్మినేని అన్నారు.