జగన్ కంపెనీల్లో రూ.140 కోట్లు పెట్టుబడులు పెట్టిన శ్రీనివాసన్ కంపెనీ
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇండియా సిమెంట్స్కు భూమి లీజు పొడిగింపుతో పాటు అదనపు నీటి కేటాయింపులు జరిపినందుకు ప్రతిఫలంగా ఇండియా సిమెంట్స్ ముడుపులను పెట్టుబడుల రూపంలో రూ.140 కోట్లకు పైగా వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టిందని సిబిఐ తెలిపింది.
ఉమ్మడి హైకోర్టుకు ఈ విషయాన్ని మంగళవారం నాడు సిబిఐ నివేదించింది. ఇండియా సిమెంట్స్ కంపెనీ వ్యవహారాలను వైస్ చైర్మన్, ఎండీ హోదాలో వెనుక ఉండి శ్రీనివాసన్ నడిపించారని, అందువల్ల తాను వేరు, కంపెనీ వేరు అని చెప్పజాలరని పేర్కొంది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మూడో నిందితుడిగా ఉన్న శ్రీనివాసన్ తన పేరును కేసు నుంచి తప్పించాలని, ఇక్కడ విచారణ పూర్తయ్యేదాకా అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపివేయాలని, హాజరు మినహాయింపు ఇవ్వాలని వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు మంగళవారం నాడు విచారణ చేపట్టారు. సిబిఐ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ బాన్ వాదనలు వినిపిస్తూ కంపెనీ వెనుక ఉండి వ్యవహారాన్ని ఎండీగా ఉన్న శ్రీనివాసన్ నడిపారని పేర్కొన్నారు.
ఆర్థిక నేరాల్లో సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించిన వ్యాఖ్యలు కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు ఎలా పెట్టారో వివరించారు. కాగా, న్యాయమూర్తి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. సిబిఐ కోర్టులో హాజరు మినహాయింపునిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.