కేసీఆర్ జాతీయ పార్టీని జగన్ అంగీకరించరు - పెడితే నవ్వులపాలే - విపక్ష నేతల విసుర్లు
''తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సరికొత్త జాతీయ పార్టీ'' అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో.. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను ఒక్క తాటిపై తెచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. మారుతోన్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారంటూ వస్తోన్న కథనాలపై తెలంగాణలోని విపక్ష నేతలు భిన్నంగా స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును కూడా ఈ వ్యవహారంలోకి లాగారు.
కేసీఆర్ సర్కార్ మరో సంచలనం - రిజిస్ట్రేషన్లు బంద్, ఆ శాఖకు సెలవులు - పున:ప్రారంభంపై నో క్లారిటీ
అసలేం జరిగిందంటే..
దేశంలో పరిపాలన వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియను సమూలంగా మార్చేసి, అధ్యక్ష తరహా ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించేందుకు బీజేపీ అంతర్గతంగా ఒక కమిటీని వేసిందని, ఇకపై జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభకు పోటీ చేసేలా నిబంధనల్ని మార్చే అవకాశాలను కూడా ఆ కమిటీ పరిశీలిస్తుందని, సదరు కమిటీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నేతృత్వం వహిస్తున్నారని, కాబట్టే బీజేపీకి పోటీగా కేసీఆర్ సారధిగా జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారంటూ పలు మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఇందులో నిజానిజాలు ఎంతనేది పక్కనపెడితే.. చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన కీలక నేతలు స్పందించారు.
అవకాశం ఉంది.. కానీ కేసీఆర్ పనికిరాడు
బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు అవకాశం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అయితే, అందుకు కేసీఆర్ తగడని, జాతీయ రాజకీయాలకు ఆయన పనికిరారని తేల్చిచెప్పారు. సోమవారం మీడియా మాట్లాడిన కోదండరాం.. ‘‘కేసీఆర్ వైఖరి జాతీయ రాజకీయాలకు పనికిరాదు. నిజానికి కేసీఆర్ జాతీయ పార్టీని తన ఫ్రెండ్ ఏపీ సీఎం జగన్ కూడా అంగీకరించబోరు'' అని కుండబద్దలు కొట్టారు.
బీజేపీ ఐడియా ఫలిస్తుందా?
దేశంలో ఇప్పుడున్నట్లు ప్రధానమంత్రి కేంద్రంగా ఉండే విధానం బదలు.. అధ్యక్ష తరహా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే దీనిపై స్పష్టమైన విధానంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మన దేశంలో అధ్యక్ష తరహా పాలన అసాధ్యమన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణలో వీఆర్వో వ్యవస్త రద్దు వ్యవహారంపైనా ప్రొఫెసర్ స్పందించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన అవసరమేకానీ, అన్ని తప్పులకు వీఆర్వోలే కారణమని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.
కేసీఆర్ నవ్వులపాలవుతారు..
ప్రజాస్వామిక విధానానికి అలవాటు పడిన దేశంలో.. అధ్యక్ష తరహా విధానానికి ప్రజలు అంగీకరించబోరని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒకవేళ కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని, గడప దాటకుండా 4 గోడల మధ్య కూర్చుంటే జాతీయ పార్టీ నడవదన్నారు. ‘‘గతంలో మాయావతి, శరద్ పవాల్ లాంటి వాళ్లెందరో ప్రధాని పదవిని ఆశించి భంగపడ్డారు. అదీగాక, దళిత వ్యతిరేకి కేసీఆర్కు మాయావతి మద్దతు ఇవ్వరు. శివసేన సహా ప్రాంతీయ పార్టీలేవీ కేసీఆర్ వెంట కలిసినడవటానికి ఇష్టపడవు'' అని జగ్గారెడ్డి అన్నారు.
కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే.