'రాజకీయం' మొత్తం వారిద్దరి చుట్టూనే?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీని ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర పూర్తికావస్తోంది. నిత్యం ప్రజల్లోనే ఉండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాదిన్నరలో ఆమె ఎటువంటి ఆందోళ కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం దృష్టిసారించలేదు.
సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్
అయితే పాదయాత్ర దాదాపుగా పూర్తి కావస్తున్న తరుణంలో షర్మిల పాదయాత్రను, తమ నాయకులపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుందని అర్థమవుతోంది. షర్మిల కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేయడంతోపాటు కార్వాన్ ను దగ్ధం చేయడం వంటివి ఆశ్చర్యం కలిగించాయి. ఇదే క్రమంలో దాడిలో ధ్వంసమైన కారులో ప్రగతి భవన్ ను ముట్టడించడానికి వెళ్లగా క్రేన్ సహాయంతో కారును, అందులోని షర్మిలను పోలీసులు తరలించారు. కారు దిగేందుకు నిరాకరించడంతో పోలీసులు క్రేన్ ను తెచ్చి కారుతోసహా షర్మిలను తీసుకువెళ్లారు.
14వ తేదీ వరకు పాదయాత్ర
నాలుగోతేదీ నుంచి ఆగిపోయినచోటే యాత్రను పున:ప్రారంభిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. ఈ సమయంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకుంటామని, వారంతా తన కుటుంబమని ప్రకటించారు. ఎవరెన్ని దాడులు చేసినా, కొట్టినా, చంపినా వెనక్కి తగ్గేది లేదని, 4 నుంచి 14వ తేదీ వరకు యాత్రను కొనసాగించనున్నట్లు చెప్పారు.
అమిత్ అరోరా రిపోర్టులో కవిత పేరు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత కూడా వార్తల్లో నిలిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కవిత పేరును చేర్చారు. అమిత్ అరోరాకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను బయటపెట్టింది. సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లుగా పేర్కొన్న ఈడీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత కీలక వ్యక్తులనిఈడీ వెల్లడించారు. అమిత్ అరోరాతోనే ఈ విషయాన్ని ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది.
కవిత రివర్స్ ఎటాక్
అమిత్ అరోరా రిపోర్టులో కవిత పేరుండటంతో ఈడీ ఇప్పడేం చేస్తుందని, నోటీసులిస్తారా? లేదంటే విచారణచేస్తారా? మొబైల్ ఫోన్లలో ఆధారాలు ధ్వసం చేయడంపై అరెస్ట్ చేస్తారా? అంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే బీజేపీ కావాలనే కక్షపూర్తిగా చేస్తోందంటూ టీఆర్ఎస్ నాయకులు రివర్స్ లో ఎటాక్ చేయడం ప్రారంభించారు. విచారణకు తాను సిద్ధమని, అరెస్ట్ చేసుకున్నా సిద్ధమేనని కవిత చెబుతున్నారు. ఇకముందు ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.