జగన్తో గ్యాప్.. 'సాక్షి'పై షర్మిల వ్యాఖ్యల కలకలం.. బాహాటంగానే అసంతృప్తి... ఎందుకీ పరిస్థితి..?
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీక్షాస్థలి నుంచి ఆమె పాదయాత్రగా బయలుదేరడం... ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం వంటి నాటకీయ పరిణామాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించాయి. ఒకరకంగా అందరి అటెన్షన్ను తనవైపు తిప్పుకోవడంలో షర్మిల సక్సెస్ అయ్యారు. నిన్నటి పరిణామాల్లో షర్మిల అరెస్టుతో పాటు... దీక్షా వేదికపై సాక్షి మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి.
సాక్షిపై షర్మిల కామెంట్స్..
'మీరట్లా చేస్తే ఎట్లమ్మా... మేము దీక్ష చేస్తున్నది మీ కోసమా..? జనాల కోసమా..? దయచేసి సహకరించండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆ మధ్యలో ఉన్న ఐదు కెమెరాలను తీసి... కొంచెం ఇటు, కొంచెం అటు సైడ్ అయిపోండి. ఇక కవరేజ్ చేసింది చాల్లేమ్మా... ఎట్లా సాక్షి మా కవరేజీ ఇవ్వదుగా...' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల వ్యాఖ్యలకు కంగు తిన్న తల్లి విజయమ్మ.. వెంటనే చేత్తో తట్టి ఆమెను వారించే ప్రయత్నం చేశారు.
జగన్-షర్మిల విభేదాలు...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు,ఆయన సోదరి షర్మిలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని... కేవలం అభిప్రాయ బేధాలు మాత్రమే ఉన్నాయని గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు,వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఖమ్మంలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ స్పీచ్లోనూ ఇదే ధ్వనించింది.
జగన్కు,షర్మిలకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదన్న విషయాన్ని ఆమె పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో తనయుడు వైఎస్ జగన్ అదే విలువలతో,నిబద్దతతో రాజకీయం చేస్తున్నారని... షర్మిల కూడా అదే బాటలో పయనిస్తారని చెప్పారు. అయితే షర్మిల నోటి వెంట మాత్రం అలాంటి మాటలేమీ రాలేదు. తాజాగా సాక్షి మీడియాపై షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
సాక్షి లైట్ తీసుకుంటుందా లేక...?
షర్మిల కామెంట్స్తో అక్కడున్న ఇతర మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా గొల్లున నవ్వారు. నిజానికి సాక్షి అంటే వైఎస్ ఫ్యామిలీకి చెందిన మీడియాగా ముద్ర పడింది. అలాంటిది స్వయంగా వైఎస్ తనయ షర్మిల.. సాక్షి మా కవరేజీ ఇవ్వదుగా అని వ్యాఖ్యానించడం వైఎస్ అభిమానులకు షాకింగ్గా అనిపించింది. షర్మిల ఉద్దేశం ప్రకారం సాక్షిలో ఆమె వార్తలకు,కార్యక్రమాలకు చోటు దక్కట్లేదు.
అన్నతో విభేదాలు లేవని ఆమె సన్నిహితులు చెప్తున్నప్పటికీ... ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న విషయం మాత్రం ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. అయితే మున్ముందు ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా... లేక షర్మిల కవరేజీని ఇకముందు కూడా సాక్షి లైట్ తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం జగన్కు ఇష్టం లేకపోవడం వల్లే సాక్షిలో ఆమెకు కవరేజీ ఇవ్వట్లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.