అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వైఎస్ షర్మిల బహిరంగ సభ?: ఎక్కడ?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు సాగిస్తోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ఓ బహిరంగ సభను నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో తలపెట్టిన సభ కంటే ముందే- దీన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన ఈ సభను నిర్వహించబోతోన్నట్లు సమాచారం. దీనికి అవసరమైన ప్రాథమిక పనులను పూర్తి చేయడంపై ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మహిళల సత్తాను చాటేలా..
వైఎస్ షర్మిల.. రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించిన తరువాత రాబోతోన్న తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం వల్ల ఈ అవకాన్ని వినియోగించుకోవాలని ఆమె అనుచరులు, సన్నిహితులు సూచించినట్లు చెబుతున్నారు. ఆ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. రాజకీయాల్లో సత్తా చాటిన మహిళల గురించి వివరిస్తూ ఈ సభను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు లోటస్పాండ్ వర్గాల్లో వ్యక్తమౌతోన్నాయి. దీనికి షర్మిల సైతం అంగీకరించారని సమాచారం. రాజకీయ ప్రసంగాలకు దూరంగా.. మహిళా శక్తిని చాటి చెప్పడానికి మాత్రమే ఈ సభను పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఎల్బీ స్టేడియం లేదా నిజాం కాలేజీ గ్రౌండ్స్..
సభను ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఎల్బీ స్టేడియం లేదా నిజాం కళాశాల మైదానం పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం కీలక నాయకుల్లో వ్యక్తమౌతోందని తెలుస్తోంది. వీలైనంత మేర జన సమీకరణ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభకు ట్రయల్గా దీన్ని షర్మిల అనుచరులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
చేరికలకు గ్రీన్ సిగ్నల్..
నిజానికి- ఖమ్మం సభలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన తరువాతే.. చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తొలుత షర్మిల పార్టీ నేతలు భావించారు. ఈలోగా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారి జాబితాను ప్రిపేర్ చేయాల్సి ఉంటుందనేది వారి అంచనా. ప్రస్తుతం వారి ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. ఖమ్మం సభ కంటే ముందే పార్టీలో చేరికలకు షర్మిల అంగీకరించినట్లు తెలుస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో కష్టించి పనిచేసినప్పటికీ.. పదవులు, గుర్తింపు లభించని నాయకులు షర్మిలకు అండగా నిలవడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
పెరుగుతోన్న మద్దతు..
తెలంగాణలో షర్మిలకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు షర్మిల నెలకొల్పబోయే పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగిన వారు.. షర్మిల ప్రకటించబోయే పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తోన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కొందరు ప్రముఖులు కూడా పార్టీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో స్థిరపడి, ఆ నగరాన్ని వదిలి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడని ప్రముఖులు.. షర్మిల పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.