లోటస్పాండ్ మీటింగ్ : అభిమానుల కోలాహాలం..ఫ్లెక్సీల్లో లేని జగన్ ఫోటో.. షర్మిల ఎజెండా డిక్లేర్ చేస్తారా?
హైదరాబాద్ లోటస్పాండ్లో మంగళవారం(ఫిబ్రవరి 9) వైఎస్ షర్మిల అధ్యక్షతన నిర్వహించనున్న వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. షర్మిల ఎజెండాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల నేడు సమావేశం కాబోతున్నారు.
మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 3వేల మంది ఈ సమావేశానికి తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కొండా రాఘవ రెడ్డి కూడా ఇప్పటికే లోటస్పాండ్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
లోటస్పాండ్... ఫెక్సీల్లో లేని జగన్ ఫోటో
లోటస్పాండ్ వద్ద ఇప్పటికే అభిమానుల కోలాహాలం మొదలైంది. భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు షర్మిలకు జై కొడుతూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ ఫోటో ఎక్కడా లేకపోవడం గమనార్హం. సమావేశం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతోనే అయినప్పటికీ మిగతా జిల్లాల నుంచి కూడా అభిమానులు తరలివస్తున్నారు.
బహుశా సమావేశం అనంతరం మిగతా జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతోనూ ఆమె భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశం కోసం వారం రోజుల ముందు నుంచే షర్మిల నుంచి అభిమానులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిజానికి తొలుత పలు జిల్లాల అభిమానులతో ఒకేసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నప్పటికీ... తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సంకేతాలిస్తారా...?
వైఎస్సార్ దంపతుల 50వ పెళ్లి రోజు సందర్భంగా షర్మిల ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనమే అని చెబుతున్నప్పటికీ దీని వెనకాల ఎజెండా వేరే ఉందన్న చర్చ జోరందుకుంది. ఏపీ ముఖ్యమంత్రి,సోదరుడు జగన్తో విభేదాల నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని... ఈ నేపథ్యంలోనే తాజా సమావేశం నిర్వహించబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం షర్మిల గత కొన్నాళ్లుగా సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. తాజా సమావేశంలో ఆమె కొత్త పార్టీకి సంబంధించి ఏమైనా సంకేతాలు ఇస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టార్గెట్ జగనేనా...?
నిజానికి షర్మిల కొత్త పార్టీ ప్రచారం ముందే లీక్ అవకపోయి ఉంటే ఈరోజు ఆమె పార్టీని డిక్లేర్ చేసి ఉండేవారని సీనియర్ నేత గోనె ప్రకాష్ రావు పేర్కొనడం గమనార్హం. 2019లో జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత షర్మిల మళ్లీ ఆయన వద్దకు వెళ్లలేదని... ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు,ఒకానొక దశలో బ్రదర్ అనిల్ జగన్ నివాసానికి వెళ్తే ఆయనకు అవమానం కూడా ఎదురైనట్లు చెప్పారు. కొద్దిరోజుల క్రితమే 'గూడు వదిలిపోతున్నాం..' అంటూ బ్రదర్ అనిల్ ఒక పోస్టు పెట్టారని... దానర్థం జగన్తో తెగదెంపులే అని చెప్పారు. ప్రస్తుతానికి షర్మిల తెలంగాణలో పార్టీ ప్రకటించినా... ఆమె లక్ష్యం ఏపీ రాజకీయాలే అని అభిప్రాయపడ్డారు.
గచ్చిబౌలి కేంద్రంగా కార్యకలాపాలు...
షర్మిల ప్రస్తుతం గచ్చిబౌలి కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి కీలక నేతలతో సంప్రదింపులు,కొత్త పార్టీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు,సూచనలు కోరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిల అంతరంగం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కనప్పటికీ... ఆమె అడుగులు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ ఆమె తెలంగాణలో పార్టీ పెడితే టీఆర్ఎస్ అనుకూల బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుంటారా... లేక బీజేపీ వ్యతిరేక టీఆర్ఎస్ అనుకూల వైఖరి తీసుకుంటారా.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఏపీ రాజకీయాలే లక్ష్యంగా జగన్కు వ్యతిరేకంగా ఆమె పార్టీ పెడితే మాత్రం అది పెనుసంచలనమే అవుతుంది.