చంద్రబాబు అడుగుల్లో వైఎస్ షర్మిల -కేసీఆర్కు దిమ్మతిరిగేలా స్ట్రాటజీ -కోటి ఎకరాలు వైఎస్ ఖాతాలోకి
వైఎస్సార్ బ్రాండ్తో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిల తన పనిని మరింత వేగవంతం చేశారు. హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ లోనే మకాం వేసిన ఆమె.. కొత్త పార్టీ నిర్మాణంపై అనుచరులతో కీలక మంతనాలు జరుపుతున్నారు. తనతో కలిసొచ్చేలా అన్ని పార్టీల నేతలతోనూ ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, తన పార్టీకి తొలి నుంచి అడ్డంకిగా ఉన్న 'ప్రాంతీయ' మార్కును చెరిపేసే దిశగానూ షర్మిల అనూహ్య స్ట్రాటజీని ఎంచుకున్నారు. విచిత్రం కాకుంటే, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆచరించి, వదిలేసిన ఎత్తుగడలనే షర్మిల కొత్తగా ఎత్తుకున్నారిలా..
ఆ ఒక్కమాటతో మేయర్ ప్రతిష్ట మూసీలోకి -'వర్షాలు కాదురా నాయనా.. వరదలు' అంటూ డ్యామేజ్ కంట్రోల్
పుట్టినిల్లు.. మెట్టినిల్లు..
షర్మిల పార్టీ తెరపైకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా ఎదుర్కొంటున్న విమర్శ.. ప్రాంతీయత. తెలంగాణకు బద్దవ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్సార్ ఫొటోతో, ఆయన రాజ్యాన్ని తెస్తానంటోన్న షర్మిలకు తెలంగాణలో నూకలు దొరకవని ఇక్కడి పార్టీల నేతలు విమర్శలు చేస్తుండటం తెలిసిందే. అయితే, ఈ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చేలా షర్మిల కార్యాచరణ రూపొందించుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే ఇక్కడి వాళ్లకే హక్కు ఉందంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు చేస్తోన్న కామెంట్లకు సమాధానంగా షర్మిల.. 'పుట్టినిల్లు.. మెట్టినిల్లు'' నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ కుమార్ ఖమ్మం జిల్లావాసి కాబట్టి, తాను తెలంగాణ కోడలినని.. ఇక్కడ పార్టీ పెట్టేందుకు తనకు హక్కు ఉందనే వాదనను షర్మిల రూపొందించారు. పుట్టిన ఇల్లు ఆంధ్ర.. మెట్టినిల్లు తెలంగాణగా షర్మిల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.
వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్పాండ్ నుంచి ఫోన్లు
కేసీఆర్ ఆంధ్రా మూలాలపై దాడి
సమైక్యవాది వైఎస్ అజెండాతో షర్మిల వస్తున్నారన్న ప్రత్యర్థుల విమర్శలకు ఆమె పార్టీ గట్టిగానే సమాధానమిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రా మూలాలపై పదే పదే దాడికి సైతం వెనుకాడటంలేదు. షర్మిల కుడి భుజంగా వ్యవహరిస్తోన్న కొండా రాఘవ రెడ్డి కొన్ని గంటల కిందట మీడియాతో మాట్లాడుతూ.. ''ఇటీవల చాలా మంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం వేసే అడుగులే వారికి జవాబులు. కేసీఆర్, కేశవరావు ఎక్కడ పుట్టారు? ఎవరు ఎక్కడైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు''అని అన్నారు. సోమవారం షర్మిలను కలిసిన తర్వాత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కూడా.. ''రాజకీయాలు ఎవరి సొత్తూ కాదు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. తెలంగాణలో పనిచేసేందుకు వస్తున్న మహిళను ప్రజలు స్వాగతించాలి. తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత స్వస్థల కేరళ. కేసీఆర్ తెలంగాణ బిడ్డ కాదు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు(కేకే) తండ్రి కూడా ఆంధ్ర నుంచి వలస వచ్చారు. కాబట్టి షర్మిల గురించి అవాకులు చెవాకులు పేలొద్దు''అని కౌంటరిచ్చారు. నిజానికి..
చంద్రబాబు రీసెర్చ్.. షర్మిల యూసేజ్..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్వీకులది ఆంధ్రా ప్రాంతమనే వాదన తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చింది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ అగ్రనాయకత్వం ఒక బృందంగా ఏర్పడి, కేసీఆర్ పుట్టుపూర్వోత్రాలపై రీసెర్చ్ లాంటిది చేయడం, చివరికి కేసీఆర్ ఆంధ్రావాడేనని తేల్చేయడం విదితమే. విజయనగరం జిల్లా బుడ్డిపేట కేసీఆర్ పూర్వీకుల గ్రామమని, కేసీఆర్ తాత వెంకట్రావు, ముత్తాత రామారావు ఆ ఊరిలోనే నివసించారని, కేసీఆర్ తాత చిన్నతనంలోనే అక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లిపోయారని స్థానికులు చెప్పిన కథనాలను కూడా టీడీపీ రిపోర్టులో పొందుపర్చారు. దీనిపై అప్పట్లోనే కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్పందిస్తూ.. కల్వకుంట్ల కుటుంబం ఏడేడు తరాల నుంచీ కరీంనగర్ గడ్డపైనే నివసించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యం విజయవంతం కావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వివాదాం ఆల్మోస్ట్ ముగిసిపోయింది. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కేసీఆర్ ఆంధ్రా మూలాలపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు రీసెర్చ్ ద్వారా బయటపడిన విషయాలను వాడుకుంటూ షర్మిల.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు..
కోటి ఎకరాలు వైఎస్ ఖాతాలోకి..
నీళ్లు, నిధులు, ఉద్యోగాలే ప్రధానాంశాలుగా తెలంగాణ ఉద్యమం సాగిందని, ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం సహా ఎన్నోన్నో ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు మహార్దశతో తెలంగాణలో కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయని సీఎం కేసీఆర్ పలు మార్లు చెప్పుకోవడం తెలిసిందే. అయితే, షర్మిల పార్టీ మాత్రం ఆ ఘనత వైఎస్సార్ కే దక్కుతుందని వాదిస్తోంది. వైఎస్ హయాంలో ఒక్క తెలంగాణలోనే 36 నీటి ప్రాజెక్టులు ప్రారంభించారని, కల్వకుర్తి సహా అనేక పథకాలు ఆయన చలవతో ఏర్పడినవేనని, కల్వకుర్తి ద్వారా ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని, 104, 108, ఆరోగ్య శ్రీ, బోధనా రుసుం మాఫీ పథకాలను పెట్టారని, అసలు తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి సాగవ్వడానికి కారకుడు వైఎస్ మాత్రమే అని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక
మాయ, మమత, జయ సరసన షర్మిల
ఉత్తరాదిలో మాయావతి, తూర్పున మమతా బెనర్జీ, దక్షిణాదిలో జయలలిత తర్వాత మెగా స్థాయిలో పార్టీని పెట్టబోతోన్న మహిళగా వైఎస్ షర్మిల రికార్డుల్లోకి ఎక్కబోతున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక మహిళ పార్టీ నడిపిన దాఖలాలు లేవని, ఆ దిశగా ప్రజల్లోకి వస్తోన్న తొలి నాయకురాలు వైఎస్ తయన షర్మిలనే అని, ముఖ్యంగా మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని కొత్త పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, షర్మిల పార్టీలో చేరికలు అనేవి ఉండవుని, ఏ పార్టీ నుంచి వచ్చిన వారైనా వ్యవస్థాపకులుగానే ఉంటారని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. పలు జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో షర్మిల మాట్లాడుతున్నారని, ఏప్రిల్ 10లోపు అన్ని జిల్లాల సమావేశాలు పూర్తవుతాయని, ఆ వెంటనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ పార్టీ ఏర్పాటు తేదీని కొండా వెల్లడించారు.