YS Sharmila: నెత్తిన బోనమెత్తి కదిలిన వైఎస్ షర్మిల... స్నేహితురాలితో కలిసి ఉత్సవాల్లో...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని ఇంటికి ఆదివారం(అగస్టు 1) షర్మిల వెళ్లారు. అక్కడ రజిని కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల నెత్తిన బోనమెత్తుకున్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు.
అమ్మవారి ఆశీర్వాదం తెలంగాణ ఆడపడుచులందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఇవాళ బోనాల పండగతో పాటు స్నేహితుల దినోత్సవం కావడంతో స్నేహితురాలి ఇంట్లో బోనాల పండగ ఉత్సవాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.షర్మిలతో పాటు వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవ రెడ్డి,ఏపూరి సోమన్న తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఆషాఢ మాసం బోనాల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఆదివారం(అగస్టు 1) లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
అంతకుముందు,బీజేపీ సీనియనేత విజయశాంతి కూడా అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పించుకున్నానని తెలిపారు.భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి బంగారు బోనం సమర్పిస్తానని అమ్మవారికి మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దొరల రాజ్యం, దొంగల రాజ్యం నడుస్తోందని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు.చెప్పారు.కరోనా నుంచి అందరం త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
బోనాల పండగలో భాగంగా సోమవారం(అగస్టు 2) ఘటాల ఊరేగింపు జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల పండగను అధికారికంగా గుర్తించి నిధులు విడుదల చేస్తోంది. దీంతో గల్లీల్లోని ఆలయాలు మొదలు ప్రధాన దేవాలయాల వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. పండగ నేపథ్యంలో ఆది,సోమవారాల్లో ప్రభుత్వం మద్యం షాపులు,బార్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులోకి వచ్చాయి. పలు మార్గాల్లో వాహనాలను అనుమతించట్లేదు.