రైతుల చావులను ఆపడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు: విరుచుకుపడిన వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై , కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైయస్సార్టీపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలను కేసీఆర్ పరిష్కరించడం లేదని, రైతులు మరణిస్తున్నా కెసిఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న వైయస్ షర్మిల తాజాగా మరోమారు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
Recommended Video
రైతులు మరణిస్తున్నా దున్నపోతు మీద వాన కురిసినట్టే కేసీఆర్ తీరు
తాజాగా ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు అని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మిరప సాగుతో నష్టపోయిన భాస్కర్, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బోయ గూడెంలో పత్తి రైతు లింగయ్య, భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన సగులం అనంతరాములు ఆత్మహత్య చేసుకున్నారని పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసిన షర్మిల మరోమారు కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నా కెసిఆర్ తీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందని మండిపడ్డారు వైయస్ షర్మిల.
పంటను కాపాడలేని పురుగుల మందే అప్పుల నుంచి కాపాడుతుందని రైతులు ఆత్మహత్య
దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారనే ఆశ లేక రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. పత్తికి, మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని భావించి రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నారని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా తమరి తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శించారు.
అయ్యా దొర గారు, పంజాబ్ రైతుల చావులు కనపడ్డాయి కానీ రాష్ట్రంలో రైతుల చావులు కనపడటం లేదా?
అంతేకాదు రైతులకు భరోసా కల్పించేందుకు దొర గారు కాలు బయటపెట్టింది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అయ్యా దొర గారు, పంజాబ్ రైతుల చావులు మీకు కనపడ్డాయి కానీ రాష్ట్రంలో రైతుల చావులు కనపడటం లేదా? రైతుల చావులను ఆపడం చేతగాని ముఖ్యమంత్రి మనకు వద్దు అంటూ వైయస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇక ఇదే సమయంలో మంగళవారంనాడు కెసిఆర్ వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి, నేరుగా క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించడానికి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని చెప్పి, తరువాత తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ పర్యటన రద్దు చేసుకోవడంపై కూడా వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వరంగల్ జిల్లా పర్యటన రద్దుపై కూడా కేసీఆర్ కు ప్రశ్నల వర్షం
సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు అంటూ ప్రశ్నించిన వైయస్ షర్మిల సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా?లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వాన పాలు కాగా రైతు కష్టం కన్నీటి పాలైందని ఇక సాయం దొర మాటలకే పరిమితమైందని వైయస్ షర్మిల రైతు సమస్యలను కళ్లకు కట్టినట్లు చెప్పడమే కాకుండా, రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై, సీఎం కెసిఆర్ వైఖరిపై నిప్పులు చెరిగారు.