షర్మిలకు బిగ్ షాక్... పార్టీ కార్యాలయం వద్ద సొంత నేతల నిరసన,ఉద్రిక్తత... ఆ కమిటీలను రద్దు చేయాలని...
వైఎస్సార్టీపీలో పదవుల పంపకాలు చిచ్చు రేపాయి. పార్టీ పెట్టి నెల రోజులైన కాకముందే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పదవుల పంపకాల్లో అన్యాయం జరిగిందని,డబ్బులకు పదవులు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా ఆ పార్టీకి చెందిన కొంతమంది అసంతృప్తి నేతలు హైదరాబాద్లోని లోటస్పాండ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. కన్వీనర్,కోకన్వీనర్ పదవులను అమ్ముకున్నారని ఆ నేతలు ఆరోపించారు. తక్షణమే ఆ కమిటీలను రద్దు చేసి,కొత్త కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు.లోటస్పాండ్ వద్ద నేతల నిరసనతో కొంత ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంగాధర్,రంజిత్ అనే ఇద్దరు వైఎస్సార్టీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కమిటీల ప్రకటనపై వ్యతిరేకత...
వైస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు,17 నియోజకవర్గాలకు కన్వీనర్,కోకన్వీర్లు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులను శుక్రవారం(జులై 30) ఆ పార్టీ నియమించిన సంగతి తెలిసిందే. షర్మిల పాదయాత్ర చేపట్టే లోపు నియోజకవర్గాల వారీగా మిగతా కమిటీలను నియమిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ఆ ప్రక్రియ పూర్తి కావొచ్చునని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ప్రకటించారు. మరోవైపు ప్రకటించిన కమిటీలు,పదవులపై కొందరు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని వదిలేసి ఎవరికో పదవులు కట్టబెట్టారని కొందరు నేతలు ఆరోపించారు.
ఇద్దరు నేతల రాజీనామా...
పదవుల పంపకాలపై తీవ్ర అసంతృప్తికి లోనైన ఇద్దరు కీలక నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి,అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కేటీ నర్సింహ రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాఘవరెడ్డి వ్యవహారం నచ్చకనే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని... పార్టీ కోసం కష్టపడుతున్నవారికి న్యాయం జరగట్లేదని ఆరోపిస్తూ కేటీ నర్సింహరెడ్డి కూడా పార్టీని వీడారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
ఇలా చేస్తే పార్టీ బతకదని...
షర్మిల పార్టీలో పదవులను అమ్ముకున్నారని ఆరోపించిన కేటీ నర్సింహరెడ్డి.... అసలైన వైఎస్సార్ అభిమానులను పక్కనపెట్టి కొత్తగా వచ్చినవాళ్లకు పదవులు ఇచ్చారని ఆరోపించారు. వైఎస్సార్టీపీ ఒక కార్పోరేట్ వ్యవస్థలా మారిపోయిందని... రాత్రికి రాత్రి డబ్బుల కోసం పదవులు అమ్ముకోవడం దారుణమని మండిపడ్డారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టాలని 2019 నుంచి వందలాది డిబేట్లలో పాల్గొన్నానని.. ఎంతో చేశానని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను బతికించాలంటే ఇలా పదవులను అమ్ముకోవద్దని,నిస్వార్థంతో పనిచేయాలని అన్నారు. డబ్బుల కోసం పదవులు అమ్ముకుంటే.. రాజశేఖర్ రెడ్డి అభిమానులను బలిచేస్తే షర్మిల పార్టీ బతకదన్నారు. కనీసం పార్టీ కార్యాలయానికి రానివాళ్లకు పదవులు ఇవ్వడం సరికాదన్నారు.పార్టీతో సంబంధం లేనివాళ్లకు,పార్టీ కోసం పనిచేయనివారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు.