వైఎస్ షర్మిల షాకింగ్ ట్వీట్: రేపిస్టు ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను వేలెత్తి చూపిస్తున్నాడు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడడం, రైల్వే ట్రాక్ పై శవమై కనిపించడంతో న్యాయం జరిగిందని పెద్ద ఎత్తున అందరూ అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి రాజు అనే కామాంధుడు హత్యాచారం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. సినీ ప్రముఖుల నుండి, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ బాధిత కుటుంబానికి అండగా న్యాయం కోసం గొంతెత్తారు. ఇప్పుడు తాజా పరిణామంతో వారంతా బాధిత చిన్నారికి న్యాయం జరిగిందని చెబుతూనే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య .. పలువురి స్పందన
ఈరోజు వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు శవమై కనిపించాడు. అయితే ఈ ఘటనపై రాజు భార్య, తల్లి పోలీసులే రాజును హతమార్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు బాలిక పై దారుణ అత్యాచారానికి దిగిన రాజు కు కఠిన శిక్ష పడిందని, దేవుడున్నాడని కొందరు రాజు మరణంపై వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటులు చిరంజీవి, రామ్, మంచు మనోజ్ తదితరులు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందిస్తున్నారు.
చిన్నారి హత్యాచార ఘటనపై , రాజు మరణంపై స్పందించిన షర్మిల
సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య మార్చిన రాజు ఆత్మహత్య ఘటనపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. నిన్నటికి నిన్న చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన షర్మిల బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అక్కడే నిరాహార దీక్షకు దిగుతానని సంచలన నిర్ణయం తీసుకొని నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. ఇక తాజాగా కామాంధుడు రాజు మరణవార్త విన్న వైయస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ పోస్ట్ చేశారు.
నిందితుడిని పట్టుకోవటంలో ప్రభుత్వ వైఫల్యం
నిన్నటికి నిన్న సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. 6 రోజులైనా కుటుంబాన్ని పరామర్శించడానికి రాని మంత్రులు మేము నిన్న చేసిన దీక్ష వల్ల దిగివచ్చి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు . ఇక నిన్న మొన్న ఆ కుటుంబాన్ని కలవడానికి రాని మంత్రులు ఈరోజు నిందితుడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కలవడానికి పోటీ పడడానికి సిగ్గుండాలి . నిందితుల్ని పట్టుకోవడం వైఫల్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని మండిపడ్డారు.
రేపిస్టు ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను చెప్పాడన్న షర్మిల
రేపిస్టు ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కెసిఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకు లేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు అని షాకింగ్ ట్వీట్ చేశారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, రేపిస్టు తనకుతానుగా ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఆరు రోజులుగా నిందితుడిని పట్టుకోలేకపోవడం పోలీస్ శాఖ వైఫల్యం కాదా అని వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. అందరూ అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసిన కామాంధుడు మరణించాడని చిన్నారి బాలికకు న్యాయం జరిగిందని చెప్తుంటే, వైఎస్ షర్మిల మాత్రం ఈ ఘటనలో ప్రభుత్వ అసమర్థతను వేలెత్తి చూపుతున్నారు.