బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవు: షర్మిల చురకలు
హైదరాబాద్: తెలంగాణలో వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండటంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాజాగా విద్యుత్ చార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ పెరిగింది లేదన్నారు. ఇక బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచి, ఇప్పుడు కరెంటు చార్జీల భారం మోపారని ధ్వజమెత్తారు. 50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి చార్జీలు వసూలు చేస్తున్నారని సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.

ఏడాదికి 6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపారంటూ కేసీఆర్పై మండిపడ్డారు వైఎస్ షర్మిల. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు, తెచ్చిన అప్పుల మీద మిత్తికి మిత్తి.. ప్రజల నుంచే వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జనానికి కరెంట్ షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు ప్రజలు రెడీగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల.
కాగా, తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ. అయితే ఇప్పటికే ఏఆర్ఆర్లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక, విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి... 20 సంవత్సరాల తర్వాత 50 యూనిట్ల వరకు ఛార్జీలు పెంచలేదన్నారు. ఇప్పుడే యూనిట్కు 50 పైసలు పెంచుతున్నామని ప్రకటించిన ఆయన.. గత ఐదేళ్లుగా టారిఫ్ రివిజన్ లేదని.. డొమెస్టిక్ వినియోగదారులకు యూనిట్కు 50 పైసలు పెంచుతామని.. ఇతర వినియోగదారులకు యూనిట్కు రూపాయి పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ పెంపు వల్ల రూ.2,110 కోట్ల ఆదాయం డిస్కమ్స్కు వస్తోందన్నారు. హెచ్.టీ వినియోగదారులకు యూనిట్ కు రూపాయి పెంచాలని భావిస్తున్నామని, దీంతో మరో రూ.4,721 కోట్ల ఆదాయం రావొచ్చన్నారు. మరోవైపు.. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. 25.78 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని తెలిపారు.