ఆఖరికి కేసీఆర్ అయినా మా నాయకులపై చెయ్యివేస్తే సహించేదిలేదు: వైఎస్ షర్మిల అల్టిమేటం.. కారణమిదే!!
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇక ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేస్తున్న వైయస్ షర్మిల తాజాగా నిర్వహించిన నిరుద్యోగ నిరాహారదీక్ష ఉద్రిక్తతలకు కారణమైంది.
ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. భగ్గుమన్న వైఎస్ షర్మిల
వైయస్ షర్మిల నిర్వహిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను, నిరుద్యోగ నిరాహారదీక్షను అడ్డుకోవడం కోసం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే తిరిగి పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు సోమన్నను మరోమారు టార్గెట్ చేసి దాడి చేసారు .దీంతో ఆగ్రహించిన వైయస్ షర్మిల పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోరువానలో నాలుగు గంటలపాటు వైఎస్ షర్మిల ధర్నా
వైయస్ షర్మిల తమ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. జోరున వాన కురుస్తున్న నాలుగు గంటల పైగా ఆందోళన కొనసాగించారు వైయస్ షర్మిల. పట్టిన పట్టు విడవకుండా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైయస్ షర్మిల చేసిన ధర్నా తో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్థానిక డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. రాత్రి రెండు గంటల తరువాత దాడికి బాధ్యులపై కేసు నమోదు చేశారని తెలుసుకున్న షర్మిల దీక్షను విరమించారు.
ఏపూరి సోమన్నపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్.. అధికార యంత్రాంగం స్పందన
అంతేకాదు తాము నిర్వహించిన ధర్నాకు అధికార యంత్రాంగం స్పందించిందని ఏపూరి సోమన్నకు భద్రత కల్పించడంతో పాటు, దుండగులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిందని వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తమ్ముడు ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ గూండాల దాడిని నిరసిస్తూ హుజుర్ నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో చేపట్టిన ధర్నాకు, అధికార యంత్రాంగం స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం అంటూ పేర్కొన్నారు.
పార్టీ నేతలపై చెయ్యి వేస్తే సహించం: వైఎస్ షర్మిల అల్టిమేటం
ఇక ఇదే సమయంలో వైఎస్ షర్మిల తమ పార్టీ నేతలపై చెయ్యివేస్తే సహించేది లేదని అల్టిమేటం జారీ చేశారు. ఇక నుండి టిఆర్ఎస్ గుండాలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఆఖరికి కేసీఆర్ అయినా తమ పార్టీ నేతలపై చెయ్యివేస్తే సహించబోమని వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా తేల్చిచెప్పారు. తమ పార్టీ కార్యక్రమాలకు అవాంతరాలు కలిగించాలని చూస్తే ఇబ్బంది పడతారని తాజా ధర్నాతో ఆమె తేల్చి చెప్పారు. తాము చేసిన ధర్నాకు మద్దతు తెలిపిన లక్కవరం మహిళలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని వైయస్ షర్మిల పేర్కొన్నారు.