YS Sharmila: ఈ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష వేదిక ఫిక్స్: ఆ జిల్లాకు
మహబూబాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. జనం బాట పట్టింది. నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ను సాధించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్సార్టీపీ.. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలకు దిగుతోంది. ఇందులో భాగంగా- ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ఆందోళనా కార్యక్రమాలను చేపట్టారు. ఈ వారం ఆమె నిరాహార దీక్ష చేపట్టనున్న వేదికను ఖరారు చేశారు.
ప్రతి మంగళవారం..
ఇదివరకు- జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల చేసిన 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రతి మంగళవారం దీక్ష కొనసాగించేలా నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారు వైఎస్ షర్మిల. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తోన్నారు. తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వల్ల నిరుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించారు.
హుజూరాబాద్ తరువాత..
తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించిన 50 వేల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ను వెంటనే ప్రకటించాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్. ఈ నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం అదే. కిందటి మంగళవారం వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సిరిసేడులో ఆత్మహత్య చేసుకున్న షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం అదే గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో దీక్ష..
ఈ సారి షర్మిల మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాలో నిరుద్యోగ నిరాహార దీక్షకు పూనుకోనున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావట్లేదనే నిరుత్సాహంతో తేజావత్ సింగ్ తండాకు చెందిన నిరుద్యోగి బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 26న వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉద్యోగాల ఖాళీల భర్తీపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది.
Recommended Video
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం..
ఇప్పుడు అదే తేజావత్ సింగ్ తండాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్షలో కూర్చుంటారు. 12 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. తెల్లవారు జామున హైదరాబాద్ బంజారాహిల్స్లోని లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం తేజావత్ సింగ్ తండాకు చేరుకుంటారు. సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెబుతారు. అనంతరం అక్కడే నిరాహార దీక్షకు కూర్చుంటారు. పూర్తిస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడేంత వరకూ నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగించాలనేది వైఎస్సార్టీపీ వ్యూహం.